/rtv/media/media_files/2025/08/21/ism-2025-08-21-10-41-16.jpg)
Indian Stock Market
భారత స్టాక్ మార్కెట్లో ఈరోజు బజాజ్, రిలయన్స్ షేర్లు మంచి ఊపు మీదున్నాయి. దీనికి తోడు జీవిత, ఆరోగ్య బీయాలపై జీఎస్టీ తొలగింపు వార్త కూడా మార్కెట్లో జోష్ ను నింపింది. అలాగే భారత ఆర్థికవ్యవస్థ బలంగా, స్థిరంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్ ప్రారంభం నుంచే లాభాల్లో ట్రేడింగ్ అవుతోంది. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు పెరిగి 81,950 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా దాదాపు 30 పాయింట్లు పెరిగి 25,100 స్థాయిలో ఉంది.
లాభాల్లో బజాజ్, రిలయన్స్..
30 సెన్సెక్స్ స్టాక్స్లో 20 లాభపడగా.. 10 నష్టపోయాయి. బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ స్టాక్స్ 1% లాభపడ్డాయి. అలాగే హాట్సన్ అగ్రో, జూపిటర్ వేగన్స్, కాంకర్డ్ బయోటెక్, గ్రాన్యుల్స్ ఇండియా, ఐటీఐ షేర్లు కూడా వేగంగా పెరుగుతున్నాయి.మరోవైపు HUL, జొమాటో నష్టపోయాయి. ఇక నిఫ్టీలోని 50 స్టాక్స్లో 30 లాభపడగా, 20 నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో మెటల్, రియాల్టీ, బ్యాంకింగ్ సూచీలు స్వల్పంగా పెరిగాయి. ఆటో, ఐటీ, ఎఫ్ఎంసిజి నష్టపోయాయి. నిన్న విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) రూ.1,100.09 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా.. దేశీయ పెట్టుబడిదారులు (DIIలు) రూ.1,806.34 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు.
మిశ్రమంగా అంతర్జాతీయ మార్కెట్..
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు మాత్రం మిశ్రమ ఫలితాలు చూపెడుతున్నాయి. ఆసియా మార్కెట్లలో.. జపాన్ నిక్కీ 0.58% తగ్గి 42,640 వద్ద, కొరియా కోస్పి 1.08% పెరిగి 3,163 దగ్గర ట్రేడవుతున్నాయి. ఇక హాంకాంగ్కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.21% తగ్గి 25,112 దగ్గర ఉండగా.. చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.22% పెరిగి 3,774 వద్ద ముగిసింది. ఇంకోవైపు ఆగస్టు 20న అమెరికా డౌ జోన్స్ 0.036% పెరిగి 44,938 దగ్గర ముగిసింది. నాస్డాక్ కాంపోజిట్ 0.67% తగ్గి 21,173 వద్ద, ఎస్ అండ్ పి 500 0.24% తగ్గి 6,396 దగ్గరా ముగిశాయి.