/rtv/media/media_files/2025/04/18/LZa1rD4h7GHgcGOfXVGY.jpg)
POLICE SAVED CHILDRENS
POLICE SAVED CHILDRENS : కారులో ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను తిరుమల ట్రాఫిక్ పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు. అత్యంత చాకచక్యంతో చిన్నారుల ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ పోలీసులపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమలలో చోటుచేసుకుంది.
Also Read : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల దుర్మరణం!
వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలుకు చెందిన ఓ కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చింది. వెంకటసుబ్బారెడ్డి, సుమలత అనే దంపతులకు ఏడేళ్ల భాను, నాలుగేళ్ల నీల సంతానం. వెంకటసుబ్బారెడ్డి ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారు. సుమలత తన పిల్లలతోపాటు వెంకటసుబ్బారెడ్డి అన్న గంగయ్య, అతని భార్య, అల్లుడు గురువారం తిరుమల శ్రీవారి దర్శనార్థం కారులో బయలుదేరారు. అలిపిరి వచ్చిన తరువాత సుమలత, గంగయ్య భార్య కాలినడకన తిరుమల వెళ్లారు. గంగయ్య, ఇద్దరు పిల్లలు, అల్లుడు మాత్రం తిరుమలకు కారులో చేరుకుని స్థానిక వరాహస్వామి అతిథిగృహం-1 పార్కింగ్ సమీపంలో పార్క్ చేశారు.
Also Read: రాజీవ్ యువ వికాసంతో యువకుల జీవితాలు మారుతాయి: భట్టి
దర్శనానికి ఎలా వెళ్లాలో తెలుసుకునేందుకు పిల్లలను కారులోనే ఉంచి గంగయ్య, అతని అల్లుడు బయటకు వెళ్లారు. డోర్లు లాక్ చేసుకుని వెళ్లడంతో కొంతసేపటికి కారులోని పిల్లలు ఊపిరాడక విలపించారు.పిల్లల ఏడుపులు పక్కనే ఉన్న ట్యాక్సీ డ్రైవర్లకు వినిపించాయి. దీంతో వీరు ఆ విషయాన్ని తిరుమల ట్రాఫిక్ పోలీసులకు చేరవేశారు. దీంతో తిరుమల ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని.. పిల్లలను కాపాడారు. కారు అద్దాన్ని పగలగొట్టి ఇద్దరు చిన్నారులను బయటకు తీసుకువచ్చారు. అనంతరం తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రికి ఇద్దరు చిన్నారులను తరలించారు. అశ్వినీ ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం చిన్నారులను స్థానిక హోంగార్డులు.. తిరుమల వన్టౌన్ పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత దీనికి కారణమైన చిన్నారుల పెదనాన్న గంగయ్యపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత చిన్నారులను వారి తల్లి సుమలతకు పోలీసులు అప్పగించారు. ఈ సందర్భంగా తన పిల్లలను రక్షించిన పోలీసులకు సుమలత ధన్యవాదాలు తెలియజేశారు.