/rtv/media/media_files/2025/10/08/big-shock-for-mohan-babu-2025-10-08-07-09-32.jpg)
Big shock for Mohan Babu... Huge fine for the university
Mohan Babu: నటుడు మంచు మోహన్బాబుకు బిగ్ షాక్ తగిలింది.తిరుపతిలో ఉన్న ఆయన యూనివర్సిటీ మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ భారీ జరిమానా విధించింది. గత మూడేళ్ల నుంచి విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ఫీజుల రూపేణా రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మోహన్ బాబు యూనివర్సిటీపై ఉన్నత విద్యా కమిషన్ విచారణ జరిపింది. విచారణలో అధిక ఫీజు వసూలు నిజమేనని నిర్ధారణ అయింది. దీంతో యూనివర్సిటీకి రూ.15 లక్షల జరిమానా విధించింది. అలాగే విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26 కోట్లను 15 రోజుల్లో తిరిగి వారికి చెల్లించాలని ఆదేశించింది. కాగా జరిమానా విధించిన రూ.15 లక్షల మొత్తాన్ని మోహన్ బాబు యూనివర్సిటీ చెల్లించింది. అంతేకాక అవకతవకలకు పాల్పడిన యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని కూడా ఉన్నత విద్యా కమిషన్ ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
కాగా గత కొంతకాలంగా మోహన్బాబు కాలేజీపై అనేక ఆరోపణలు వస్తున్నాయి.విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం, యూనివర్సిటీ ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలకు పాల్పడటం, ఒరిజినల్ సర్టిఫికెట్లను వారికి ఇవ్వకుండా నిలిపివేయడంపై ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ విచారణ జరిపింది. ఆరోపణలన్నీ నిజమేనని తేలడంతో మోహన్బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయానికి రూ.15 లక్షల జరిమానా విధించింది. 2022-23 నుంచి గతేడాది సెప్టెంబరు 30 వరకు విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26,17,52,872 మొత్తాన్ని తిరిగి చెల్లించాలని గత నెల 17న కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన వివరాలను కమిషన్ వెబ్సైట్లో ఉంచింది. అలాగే మోహన్ బాబు విశ్వవిద్యాలయం అనుమతి, గుర్తింపును ఉపసంహరించాలని ప్రభుత్వానికి, యూజీసీ, ఏఐసీటీఈ, పీసీఐ, ఐసీఆర్, ఎన్సీఏహెచ్పీ, హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సెల్కు తదితర సంస్థలకు సిఫార్సు చేయడం గమనార్హం.
అసలేం జరిగిందంటే.....
తిరుపతి జిల్లాలో రంగంపేటలో మోహన్ బాబు శ్రీవిద్యానికేతన్ పేరుతో ఏర్పాటు చేసిన కాలేజీ 2022లో మోహన్బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయంగా మారింది. దానిప్రకారం అప్పటి వరకు శ్రీవిద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న సీట్లలో 70%, ఆ తర్వాత ప్రైవేటు విశ్వవిద్యాలయంలో గ్రీన్ఫీల్డ్ కింద ప్రారంభించే కోర్సుల్లోని 35% సీట్లను ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తుంది.దీనికి సంబంధించి ఉన్నత విద్య నియంత్రణ కమిషన్ ఫీజులను నిర్ణయిస్తుంది. కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి కమిషన్ ఎంతయితే ఫీజులను నిర్ణయించిందో అంతే వసూలు చేయాలి. అయితే విశ్వవిద్యాలయం మాత్రం అదనంగా ఫీజులు వసూలు చేస్తుందని తల్లిదండ్రుల అసోసియేషన్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్తో పాటు విద్యాశాఖ మంత్రి తదితరుకు ఫిర్యాదు చేసింది. బిల్డింగ్, ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులతో పాటు హాస్టల్లో ఉండని వారి నుంచి కూడా మెస్ ఛార్జీలు వసూలు చేస్తోందని వారు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల మేరకు కమిషన్ ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై ఆ విశ్వవిద్యాలయం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఉన్నత న్యాయస్థానం గత నెల 26న మూడు వారాలపాటు తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.
మరోవైపు మోహన్ బాబు యూనివర్సిటీపై అనేక ఆరోపణలు వచ్చాయి. విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఏఐసీటీఈకి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. విద్యార్థి సంఘాలు కూడా మీడియా సమావేశాలు నిర్వహించాయి. మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవలు జరిగిన సమయంలో మంచు మనోజ్ కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతుగా ఉంటానని ప్రకటించడం అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. తన తండ్రి ఎంతో ఉన్నత విలువలతో విద్యాసంస్థలను స్థాపించారని, అయితే ఇప్పుడు వాటిపై వస్తున్న ఆరోపణల విషయంలో.. తాను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మద్దతుగా ఉంటానంటూ మంచు మనోజ్ ప్రకటించడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
Also Read: Snake wife: రాత్రికి రాత్రి పాములా మారిపోతున్న భార్య.. గజగజ వణికిపోతున్న భర్త