/rtv/media/media_files/2025/10/30/tragedy-in-nalgonda-district-2025-10-30-09-57-27.jpg)
Tragedy in Nalgonda district.
TG Crime : ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంటను చూసి కాలానికి కన్నుకుట్టింది. భవిష్యత్తులో బంగారు జీవితం గడపాలని కలలు కన్న వారి కలలన్నీ కల్లలయ్యాయి. పారాణి ఆరకముందే ప్రియురాలైన నవవధువు మృతిచెందగా..ప్రియుడైన వరుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆ యువతిని కబళించగా..యువకుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు.ఈ దురదృష్టకరమైన సంఘటన నల్గొండ జల్లాలో నెలకొంది.
వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాగుర్రంపోడు మండలం చాంలేడు గ్రామానికి చెందిన చిలువేరు నవీన్కు, నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన అనూషలు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో 14 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే తమ ప్రేమ ఇష్టం లేని పెద్దలు ఏమైనా చేస్తారనే భయంతో వారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పెద్దలు సమ్మతించారు. దీంతో మూడు రోజుల క్రితం పెద్దల సమక్షంలో గుడిలో దండలు మార్చుకొని తిరిగి పెళ్లి చేసుకున్నారు. అనంతరం నవీన్ తన భార్య అనూష(22)తో కలిసి బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై గుర్రంపోడు గ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో గుర్రంపోడు సమీపంలోని వంతెన మీదకు వచ్చేసరికి వీరి ద్విచక్ర వాహనం మరో ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్ కిందపడి తలకు తీవ్ర గాయమైంది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన నవీన్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. భార్య అనూష అమాంతం వంతెన గోడపై నుంచి ఎగిరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడిపోయింది. నీటిలో మునిగిపోయిన అనూషను స్థానికులు 20 నిమిషాల పాటు వెతికి ఆమెను ఒడ్డుకు చేర్చారు. అనూషతో పాటు నవీన్ను నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
కాగా అందర్నీ ఎదిరించి పెళ్లిచేసుకోవడంతో పాటు పెద్దలను ఒప్పించి మరోసారి ఒకటైన ఆ దంపుతుల ఆశలు అడియాసలు కావడంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.కాళ్ల పారాణి ఆరక ముందే.. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆ యువతిని కబళించడం,..యువకుడు ప్రాణాలతో పోరాడుతుండటం అందర్నీ కలిచి వేసింది. నర్సింగ్ పూర్తి చేసిన అనూష త్వరలోనే ఉద్యోగంలో చేరాలనుకుంది. అలాంటి సమయంలో ద్విచక్రవాహనం రూపంలో అనూషకు మృత్యువు ముంచుకు రావటంతో చాంలేడు, దామెర గ్రామస్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. నవీన్ పరిస్థితి సీరియస్గా ఉండటంతో తల్లీదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: తీరం దాటిన మొంథా తుపాను.. ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
Also Read: తుఫాన్ బీభత్సం కోనసీమలో పెను విలయం.. లైవ్ అప్ డేట్స్!
Follow Us