/rtv/media/media_files/2025/09/30/meat-and-liquor-banned-this-dussehra-2025-09-30-16-04-01.jpg)
Meat and liquor banned this Dussehra
Gandhi Jayanthi : ఈ ఏడాది దసరా పండుగ మద్యం, మాంసం ప్రియులకు షాకిచ్చింది. అక్టోబర్ 2న దసరా పండుగ వస్తుండగా అదే రోజు గాంధీ జయంతి కావడంతో మద్యం, మాంసం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాజధాని నగరంలోనూ అక్టోబర్ 2న మాంసం దుకాణాలు బంద్ చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే కమిషనర్ ఓ ప్రకటన విడుదల చేశారు.మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలు, స్లాటర్ హౌస్లను మూసివేయాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. ఈ మేరకు కమిషనర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న మాంసం దుకాణాలు బంద్ చేయాలని జీహెచ్ఎంసీ యాక్ట్ 1955లోని 533B ప్రకారం స్టాండింగ్ కమిటీలో ఆమోదించారని ఆయన గుర్తుచేశారు. ఆ రోజున మాంసం అమ్మకాలపై సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షణ చేపడుతారని, ఎవరైన విక్రయాలు చేపడితే సరైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈసారి గాంధీ జయంతి రోజునే దసరా రావడంతో మాంసం విక్రయదారులు అయోమయంలో పడ్డారు. దసరా అనగానే తెలంగాణలో ముక్కా చుక్కా తప్పనిసరి కానీ, ఆ రోజు గాంధీజయంతి వస్తుండటంతో మాంసం విక్రయదారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. చాలా గ్రామాల్లో సోమవారం రోజునే బతుకమ్మ ఆడారు. దీంతో ఒక రోజు గ్యాప్ ఇచ్చి బుధవారం రోజున దసరా చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. గురువారం గాంధీజయంతి వస్తుండటంతో మద్యం, మాంసం దుకాణాలు మూసి ఉంటాయనే ఉద్దేశంతో బుధవారం రోజునే దసరా చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా మాంసం దుకాణాలతో పాటు మద్యం షాపులను కూడా మూసివేస్తున్నట్లు రేవంత్రెడ్డి ప్రభుత్వం వెల్లడించింది. ప్రతి ఏడాది మహాత్మా గాంధీ జయంతికి దేశవ్యా్ప్తంగా ఈ నియమాన్ని పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది మహాత్మా గాంధీ జయంతి, దసరా పండుగలు ఓకే రోజు వచ్చాయి. ఈ క్రమంలో మద్యం షాపులను ప్రభుత్వం మూసివేయాలని నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల వేళ..కనిపించని సందడి
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. ఈ క్రమంలోనే దసరా పండుగు కూడా రావడంతో గ్రామాల్లో సందడి నెలకొంటుందని అందరూ అనుకున్నారు. కానీ, దసరా రోజునే గాంధీజయంతి రావడంతో పోటీ చేయాలనుకున్న ఔత్సహికులు నిరాశకు గురవుతున్నారు. దసరా సందర్భంగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ప్రజలను మచ్చిక చేసుకునేందుకు మద్యం, మాంసం పంపిణీ చేయాలని భావించినప్పటికీ ఈసారి గాంధీజయంతి అడ్డురావడంతో వారి ఆశలపై నిల్లు జల్లినట్లయింది. తెలంగాణలో దసరాను ఘనంగా చేసుకుంటారు. మద్యం, మాంసం తప్పనిసరి. కానీ ఈ దసరాకు గాంధీ జయంతి అడ్డుగా రావడంతో గ్రామాల్లో పండుగ సందడి కనిపించడం లేదని పలువురు వాపోతున్నారు.
గతేడాది రూ.800 కోట్ల మద్యం అమ్మకాలు
తెలంగాణలో దసరా అంటే ప్రతి ఇంట్లో మటన్ ముక్క, మద్యం తప్పనిసరి. మందు లేకుండా ముద్ద దిగదు. గతేడాది రాష్ట్రంలో మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగాయి. సాధారణ రోజుల్లో రోజుకు రూ.124 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతుంటే దసరా సందర్భంగా అక్టోబర్ 1నుంచి 10 వతేదివరకు రూ.800 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత అక్టోబర్ 10న రికార్డు స్థాయిలో రూ.139 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి వైన్షాలకు తరలించారు. ఒకే రోజు ఏకంగా 2.35 లక్షల బీర్లు వైన్ షాప్ లకు చేరడం గమనార్హం. గత ఏడాది అక్టోబర్1వ తేదీ నుంచి గణాంకాలను పరిశీలిస్తే.. 8 రోజుల్లో రూ.852.38 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో 8.37 లక్షల మద్యం కేసులు, 14:53 లక్షల కేసుల బీరు ఉన్నాయి. అయితే ఈ ఏడాది దసరా రోజున గాంధీ జయంతి వస్తుండంతో మద్యం అమ్మకాల జోరు తగ్గుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: అక్టోబర్ 1 లేదా 2.. నవరాత్రి ఉపవాసం ముగించడానికి సరైన రోజు ఏదో తెలుసా?