/rtv/media/media_files/2025/10/04/telangana-jagruti-as-a-political-party-2025-10-04-16-25-02.jpg)
Telangana Jagruti as a political party
Kalvakuntla Kavitha : భారత రాష్ట్ర సమితి (BRS) నుంచి సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త్వరలో రాజకీయ పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలమైన శక్తిగా ఆవిర్భవించేలా ఆమె పావులు కదుపుతున్నారని తద్వారా తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఆమె దృష్టంతా తెలంగాణ జాగృతిని బలోపేతం చేయడంపై కేంద్రీకృతమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సంస్థ రాష్ట్ర కమిటీని కవిత ప్రకటించారు. కమిటీలో పలువురు నూతన సభ్యులను నియమించినట్లు ఆమె విడుదల చేసిన ప్రకటన ద్వారా అర్థమవుతోంది. తన నూతన కార్యవర్గం ద్వారా తన తదుపరి రాజకీయ ప్రయాణంపై నెలకొన్న ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. ఇటవల బీసీ నినాదం ఎత్తుకున్న కవిత ఆ దిశగానే తన కార్యవర్గాన్ని ప్రకటించారు.
ముఖ్యంగా తన కార్యవర్గంలో సామాజిక న్యాయం ప్రధాన అంశంగా ఉండేలా ఆమె సభ్యులకు పెద్దపీట వేశారు. కొత్తగా ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గంలో 80 శాతానికి పైగా పదవులను బడుగు, బలహీన వర్గాల వారికి కేటాయించినట్లు కవిత తెలిపారు. ముఖ్యంగా, గతంలో బీఆర్ఎస్ కార్మికవిభాగం నాయకుడిగా ఉన్న ఎస్టీ వర్గానికి చెందిన సీనియర్ నేత లకావత్ రూప్ సింగ్ను తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం ఆసక్తి కలిగిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో ఎస్టీ, బీసీ, మైనారిటీల పట్ల వివక్ష ఉందని విమర్శలు వచ్చిన నేపథ్యంలో జాగృతి కార్యవర్గం పై ఎలాంటి విమర్శలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. భవిష్యత్తులో ఆమె బడుగు బలహీన వర్గాల నాయకురాలిగా తన ఇమేజ్ను మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ కమిటి ద్వారా చెప్పకనే చెప్పినట్లయింది.
వచ్చే ఎన్నికల నాటికి బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న కవిత తన రాజకీయ వ్యూహంలో భాగంగా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ పర్యటనలో భాగంగా వివిధ జిల్లాల్లోని మేధావులు, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. వారి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించిన అనంతరం ప్రజల నుంచి వచ్చిన సలహాల ఆధారంగానే కమిటీ మూడో దశ నియామకాలు ఉంటాయని ఆమె తెలిపారు. దీన్నిబట్టి కవిత, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన రాజకీయ కార్యకలాపాలను రూపొందించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడవుతోంది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆమె పోషించిన పాత్ర, తెలంగాణ జాగృతి ద్వారా సంపాదించుకున్న గుర్తింపును తిరిగి ప్రజల మధ్యకు తీసుకెళ్లి తన రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేయాలనుకుంటున్న కవిత తన పర్యటనను అందుకు అనుకూలంగా మార్చుకోనున్నారు.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కావడం, ఇప్పుడు జాగృతిని బలోపేత చేయడం, ఇవన్నీ కవిత భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై చర్చకు దారి తీస్తోంది. అయితే ఆమె కేవలం జాగృతి వేదికగా సామాజిక ఉద్యమకారిణిగా మాత్రమే కొనసాగుతారా? లేకుంటే ఈ వేదికను కొత్త రాజకీయ పార్టీగా మలుస్తారా అనేది ఇపుడు చర్చనీయంశంగా మారింది. ప్రస్తుతానికి ఆమె ప్రకటనలు పూర్తిగా సామాజిక న్యాయం, తెలంగాణ అస్తిత్వం, ప్రజల సలహాల సేకరణ చుట్టూ తిరుగుతున్నప్పటికీ భవిష్యత్తులో రాజకీయ వేదిక ఏర్పాటు వైపు ఆమె అడుగులు వేస్తారనే సంకేతాలు ఇస్తున్నాయి. అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవడం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌజ్కే పరిమితమవ్వడం తో తన రాజకీయ అస్తిత్వాన్ని ప్రజల ముందుంచి రాజకీయంగా ఎదిగేందుకు కవిత పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం తాను అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న ‘తెలంగాణ జాగృతి’ సంస్థకు రాజకీయ పార్టీ రూపం ఇవ్వడం ద్వారా భవిష్యత్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలని కవిత నిర్ణయించుకున్నారన్న ప్రచారం సాగుతోంది. తెలంగాణ ఆత్మ గౌరవం, అస్తిత్వం ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లేలా కొత్త పార్టీ కార్యాచరణ ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తులు, సంస్థలతో పాటు కలిసి వచ్చే వారిని కలుపుకొని రాజకీయంగా అడుగులు ముందుకు వేయడంపై కవిత కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : ప్రియురాలిని హత్య చేసి బ్లూ డ్రమ్ములో కుక్కిన ప్రియుడు.. ఎందుకంటే?