ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మరింత పారదర్శకమైన సేవలను అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల గ్రీవెన్స్ మాడ్యూల్ను తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఈ గ్రీవెన్స్ మాడ్యూల్ను పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు వస్తే అధికారిక వెబ్సైట్ indirammaindlu.telangana.gov.in కు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదుపై ఎప్పటికప్పుడు తీసుకున్న చర్యల వివరాలు ఫిర్యాదుదారుని మొబైల్కు మెసేజ్ ద్వారా తెలియజేస్తాం. Also Read: ఈ నెలలోనే ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం: ఉత్తరాఖండ్ సీఎం గ్రామాల్లో ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిపల్ కమీషనర్ ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదు వెళ్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఎలాంటి మధ్యవర్తులకు తావులేకుండా అర్హులైన వారికే ఇళ్లు మంజూరయ్యేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంటుంది. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన ఈనెల 8వ తేదీకి హైదరాబాద్ మినహా 32 జిల్లాలలో 95 శాతం పూర్తికాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 88 శాతం పూర్తయింది. త్వరలో లబ్దిదారుల ఎంపిక పూర్తిచేసి ఇండ్ల నిర్మాణానికి చేపట్టాల్సిన కార్యాచరణపై దృష్టి సారించాలని అలాగే అర్హులైన లబ్దిదారులకు ఇళ్లు అందేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మొదటి విడతలో నివాసస్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించి ఇస్తాం. రెండవ దశలో ప్రభుత్వమే నివాస స్థలంతోపాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తుంది. మొదటి విడతలో వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్ జెండర్లు, సఫాయి కర్మచారులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించాం. Also Read: భార్యలను ఎంతసేపు చూస్తూ కూర్చుంటారు..ఆదివారాలు పని చేయండి! గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకునేలా అవకాశం కల్పించాం. వీళ్లు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా ఇళ్లు నిర్మించుకోవచ్చని చివరి లబ్దిదారుని వరకు ఇళ్లు మంజూరు చేస్తామని'' మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.