New Osmania hospital: 2వేల బెడ్లు, 30 డిపార్ట్‌మెంట్లు, 41 ఆపరేషన్ థియేటర్స్.. కొత్త ఉస్మానియా హాస్పిటల్ హైలెట్స్ ఇవే!

గోషామహల్‌ కొత్త ఉస్మానియా ఆస్పత్రిలో 2వేల బెడ్లు, 30 డిపార్ట్‌మెంట్లు, 41 ఆపరేషన్ థియేటర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో వైద్య సిబ్బంది, ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 

New Update
osmaina

New Osmania Hospital Foundation

New Osmania Hospital: గోషామహల్‌లో కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. వందేండ్లుగా పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఘన చరిత్ర ఉస్మానియా హాస్పిటల్ సొంతం అన్నారు. వైద్య విద్యకు కూడా ఉస్మానియా ఓ బ్రాండ్‌ అని చెప్పారు. ఉస్మానియా డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని, అటువంటి ఓ గొప్ప సంస్థకు వేదికైన పురాతన భవనం శిథిలావస్థకు చేరడంతో వైద్య సేవలు అందించలేని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ నేపథ్యంలోనే దశాబ్దాల డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్షలను నిజం చేస్తూ నూతన భవనానికి శంకుస్థాపన చేశామన్నారు. 

వందేండ్లకుపైగా సేవలు..

అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక టెక్నాలజీతో కొత్త ఉస్మానియా హాస్పిటల్‌ను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. రాబోయే వంద ఏండ్లు ప్రజలు గుర్తుంచుకునే ఈ వేడుకలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. చర్లపల్లికో, మరో ప్రాంతానికో హాస్పిటల్‌ను తీసుకెళ్లాలని కొంత మంది ప్రపోజల్స్‌ పెట్టారు. కానీ 1919 నుంచి వందేండ్లకుపైగా ఇక్కడి ప్రజలకు ఉస్మానియాతో అనుబంధం ఉంది. అందుకే ఈ ప్రాంతంలోనే హాస్పిటల్ పెట్టాలని నిర్ణయించాం. ఈ ప్రాంత ప్రజలకు ఉస్మానియా ఆస్పత్రితో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఉస్మానియాకు దగ్గరగా ఉన్న గోషామహల్‌ స్థలాన్ని హాస్పిటల్‌ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి ఎంపిక చేశారు. ఇక్కడ పోలీస్ శాఖకు ఇంకా 11 ఎకరాలకుపైగా స్థలం ఉంటుంది. హాస్పిటల్ కోసం స్థలం ఇచ్చిన పోలీస్ శాఖకు, గోషామహల్ ప్రజలకు అభినందనలు తెలిపారు రాజనర్సింహ.

అన్నిరకాల వైద్య సేవలు..

26 ఎకరాల 30 గుంటల విశాలమైన ప్రాంగణంలో, 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉస్మానియా కొత్త హాస్పిటల్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో 1168 బెడ్లు ఉండగా కొత్త ఉస్మానియాలో 2 వేల బెడ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇందులో 500 బెడ్ల కెపాసిటీతో ఐసీయూ, 22 డిపార్ట్‌మెంట్లకు అదనంగా మరో 8 డిపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేస్తున్నాం. ఉస్మానియాకు వచ్చిన పేషెంట్‌కు అన్నిరకాల వైద్య సేవలు అందిస్తాం. ఇక్కడికి వచ్చిన పేషెంట్‌ను ఇంకో దగ్గరికి పంపించే పరిస్థితి ఉండదు. సుమారు 41 ఆపరేషన్ థియేటర్లు నయా ఉస్మానియాలో అందుబాటులోకి తీసుకొస్తున్నాం. హాస్పిటల్ ప్రాంగణంలోనే డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలు ఉంటాయి. విద్యార్థులకు, ఫాకల్టీకి అధునాతన వసతులతో కూడిన హాస్టల్ సదుపాయం, 750 సీట్ల కెపాసిటీతో ఆడిటోరియం, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: TG News: తెలంగాణలో భూములు కొనాలనుకుంటున్న వారికి బిగ్ షాక్.. మరో 2 నెలల్లో!

ఇక పేషెంట్ల అటెండర్ల కోసం ధర్మశాల నిర్మిస్తున్నామని చెప్పారు. హాస్పిటల్‌ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా ల్యాండ్‌స్కేప్ గార్డెన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానికులకు ఇబ్బంది కలగకుండా హాస్పిటల్‌కు నలువైపులా విశాలమైన రోడ్లు, సుమారు 3 వేల వాహనాలు ఒకేసారి పార్కింగ్ చేసుకునేలా అండర్‌‌గ్రౌండ్ పార్కింగ్ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే స్కైవాక్ నిర్మాణం చేపడుతున్నాం. గోషామహల్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిది. ఫైర్ స్టేషన్, విద్యుత్ సబ్‌స్టేషన్, పోలీస్ అవుట్‌ పోస్ట్ వంటివి కూడా హాస్పిటల్ ప్రాంగణంలో ఉంటాయి. సుమారు రూ.2700 కోట్లతో నిర్మించే, ఈ కొత్త ఆస్పత్రిని రెండేండ్లలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. హాస్పిటల్ ప్రారంభమయ్యాక, స్థానికుల వ్యాపారాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

ఇది కూడా చదవండి: Congress Vs BRS: పిట్టల దొర మాటలు ఆపు.. కేసీఆర్ కు కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు