Kaleshwaram Commission report: రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక

కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ నివేదికను ప్రభుత్వానికి అప్పగించింది.  ఇరిగేషన్‌ సెక్రటరీ రాహుల్‌ బొజ్జా రెండు సీల్ కవర్‌లో నివేదిక తీసుకున్నారు. రాహుల్‌ బొజ్జా ఆ నివేదికను సీఎస్‌ రామకృష్ణారావుకు అందించనున్నారు.

New Update
kaleshwaram commission

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని లోపాలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన తుది నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. బుధవారం (జులై 31, 2025) బీఆర్కే భవన్‌కు చేరుకున్న కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్, సీల్డ్ కవర్‌లో 2 డాక్యుమెంట్లను నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు అందజేశారు.

15 నెలలు.. 115 మందికి పైగా స్టేట్‌మెంట్

దాదాపు 15 నెలల పాటు విస్తృత విచారణ జరిపిన కమిషన్, ఈ నివేదికను 500 పేజీల చొప్పున మొత్తం వెయ్యి పేజీలతో రూపొందించినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, డిజైన్, నిర్వహణలో జరిగిన అవకతవకలు, నాణ్యతా లోపాలపై కమిషన్ లోతుగా దర్యాప్తు చేసింది. ఈ విచారణలో ఇంజనీర్లు, అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులు సహా 115 మందికి పైగా సాక్షులను విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించడంతో తన బాధ్యత ముగిసిందని జస్టిస్ పీసీ ఘోష్ అన్నారు.  

2024 మార్పిలో ఏర్పాటు

మెడిగడ్డ బ్యారేజీలో కొన్ని పిల్లర్లు కుంగిపోయిన తర్వాత, గత ఏడాది మార్చిలో తెలంగాణ ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ నివేదికను ప్రవేశపెట్టి చర్చించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నివేదిక వెల్లడి

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. గతప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతోపాటు పలువురు చీఫ్ ఇంజనీర్లున కమిషన్ విచారించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయం అంచనాలను మించి రూ. 1.47 లక్షల కోట్లకు పైగా పెరిగినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, నివేదికలోని అంశాలు కీలకం కానున్నాయి. 

Advertisment
తాజా కథనాలు