/rtv/media/media_files/2025/02/10/ruUDwpMjqQVhhDRgYGtC.webp)
Telangana High Court
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి 15వ వార్డు కౌన్సిలర్ భర్త నాగవెల్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు పట్టణంలోని రెడ్డి కాలనీలో అదును చూసి కత్తులతో విచక్షణారహితంగా పొడవడంతో రాజలింగమూర్తి కుప్పకూలిపోయాడు. కొద్దిసేపు మృత్యువుతో పోరాడి తనువు చాలించాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై కేసీఆర్, మాజీ మంత్రులతో పాటు సదరు గుత్తేదారు కంపెనీలపై రాజలింగమూర్తి కేసు నమోదు చేయడం ద్వారా వెలుగులోకి వచ్చారు.
అతనే లేరు...విచారణ ఎలా..
నిన్న రాజ లింగమూర్తి వేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే ప్రస్తుతం అతను చనిపోయినందున అతను వేసిన పిటిషన్ కు అర్హత లేదని కోర్టు చెప్పింది. ఫిర్యాదుదారుడు చనిపోయినప్పుడు కోర్టు ఎవరిని విచారించాలి, ఎవరి స్టేట్ మెంట్ ఆధారంగా విచారణ చేయాలో చెప్పాలని ప్రశ్నించింది. సరే ఫిర్యాదు ద్వారా విచారణ చేపట్టినా...అందులో అంశాల మీద ఎవరు వాంగ్మూలం ఇస్తారని అడిగింది. ఫిర్యాదుదారు చనిపోయినా విచారణ జరపవచ్చని, గడువు ఇస్తే వాదనలు వినిపిస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్రావు కోరడంతో విచారణను కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది.
మేడిగడ్డ కుంగుబాటుపై రాజలింగమూర్తి భూపాలపల్లి మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దానిని ఆ కోర్టు కొట్టివేసింది. దానిపై రివిజన్ ఫిర్యాదును విచారణ చేయాలని జయశంకర్ భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి నిర్ణయం తీసుకున్నారు. దీంతో కేసీఆర్, హరీశ్ రావుకు నోటీసులు పంపించారు. అయితే వీటిని కేసీఆర్, హరీశ్ రావు ఇద్దరూ హైకోర్టులో సవాల్ చేశారు. దానిపైనే హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ నిన్న విచారించారు. అయితే దీనిపై ఫిర్యాదుదారుడు చనిపోయినా విచారణ చేయవచ్చని..గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.30 లక్షల కోట్లు దుర్వినియోగం చేసిందని చెప్పడానికి మేడిగడ్డ కుంగుబాటే నిలువెత్తు సాక్ష్యమని పీపీ అన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఎలాంటి నివేదిక సమర్పించలేనప్పుడు విచారణ కొనసాగింపు ఎలా చేపట్టాలో చెప్పాలని జడ్జి అడిగారు. పీపీ చెప్పిన సమాధానాలకు ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: Mumbai: వార్ధా సామూహిక అత్యాచారం కేసులో..8 మంది నిర్దోషులుగా హైకోర్టు ప్రకటన