/rtv/media/media_files/2025/09/30/why-do-people-celebrate-dussehra-2025-09-30-21-31-43.jpg)
Why do people celebrate Dussehra?
Dussehra : తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా సాగిన బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఇక మిగిలింది దసరా పండుగ. ఈసారి విజయదశమి (దసరా) ఆక్టోబర్ 2న వస్తోంది. ఈ పండుగను హిందువుల అంత్యంత వైభవంగా జరుపుకుంటారు. నిజానికి దసరా గురించి మన పురాణాల్లో విశేషంగా చెప్పారు. రామాయణం. మహాభారత గ్రంథాల్లోనూ దసరా పండుగ ప్రాధాన్యతను వివరించారు. రాముడు యుద్ధంలో విజయం సాధించిన రోజుగా రామాయణం, పాండవులు జమ్మిచెట్టు మీదనుంచి ఆయుధాలు తీసుకున్న రోజుగా భారతంలో ఉంది.
మహాభారతంలో పాండవులు, కౌరవుల మధ్య జరిగిన జూదంలో పాండవులు ఓటమి పాలవుతారు. దీంతో వారు రాజ్యాన్ని విడిచి అరణ్యవాసం వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో వాళ్లకు సంబంధించిన ఆయుధాలన్నింటినీ ఒక మూట కట్టి, వాటిని జమ్మిచెట్టుకు కట్టి తిరిగొచ్చే వరకూ వాటిని చూసుకొమ్మని చెబుతారు. అరణ్యవాసం పూర్తయ్యాక పాండవులు తిరిగి వచ్చి ఆశ్వయుజ మాసంలోని దశమి రోజునే జమ్మిచెట్టు మీద నుంచి తమ ఆయుధాలను తీసుకుంటారు. ఆ తర్వాత కౌరవులపై యుద్ధం చేసిన పాండవులు తిరిగి తమ రాజ్యాన్ని దక్కించుకుంటారు. అలా వారు విజయ దశమి రోజున జమ్మి చెట్టుపై పెట్టిన ఆయుధాలను తిరిగి తీసుకున్నందున ఆ రోజున దసరా పండుగను జరుపుకోవడంతో పాటు, ఆ రోజే ప్రత్యేకంగా జమ్మి చెట్టుకి పూజలు చేస్తారు. అదే రోజు పాండవులు జమ్మిచెట్టుపై ఒక పాల పిట్టను కూడా చూశారని, దాని వల్ల వారికి శుభం జరిగిందని చెబుతారు. అందుకే దసరా రోజున జమ్మిచెట్టుకు పూజలు చేయడంతో పాటు పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. పాండవులు తమ ఆయుధాలకు పూజలు నిర్వహించడంతో ఇపుడు కూడా ఆయుధపూజ చేయడం ఆనావాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా జమ్మి చెట్టును పూజిస్తూ ఈ స్తోత్రం చదవాలి
శమీ శమయతే పాపం
శమీ శత్రువినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ
రామస్య ప్రియదర్శినీ!!
కరిష్యమాణ యాత్రాయా యథాకాలమ్ సుఖం మయా తత్ర నిర్విఘ్న కల్తీత్వం భవ శ్రీరామ పూజితా!! అని మంత్రం చదువుతారు.
ఇక జమ్మి చెట్టుకు మొక్కుకున్న తర్వాత జమ్మి ఆకులను తీసుకుని వాటిని బంధువులకు, స్నేహితులకు ఇవ్వడమనే సంప్రదాయం కొనసాగుతోంది. జమ్మి చెట్టుని ఈ రోజున ప్రత్యేకంగా చూడడమే కాకుండా జమ్మి ఆకులను 'బంగారం' అని పిలుచుకుంటారు. ఆకులను ఎదుటివారికి పెట్టి వారిని ఆలింగనం చేసుకుంటారు. దీన్ని అలయ్ బలయ్ అంటారు.ఆలయ్ ఐలయ్ అన్నది ఇతరులతో సోదరభావాన్ని పెంపోదిస్తోంది. జమ్మి ఆకు అంటే బంగారాన్ని ఎదుటివారి చేతిలో పెట్టి వారిని కౌగిలించుకోవడమే ఆలయ్ బలయ్. ఇక మగవాళ్లు ఆడబిడ్డల కాళ్లకు దండం పెట్టి జమ్మి ఆకులని చేతికిస్తారు. నాన్నమ్మలు, అమ్మమ్మలు, మేనత్తలు, అమ్మలు, చిన్నమ్మలే కాదు... చెల్లెళ్లయినా, అక్కలైనా, వదినలైనా... వాళ్ల కాళ్లు మొక్కుతారు. ఇంతటి మహాత్తర సంప్రదాయం ఒక్క తెలంగాణకే సొంతం.
దసరాకు సంబంధించి రామాయణంలోనూ ఒక కథనం ఉంది. శ్రీరాముడు లంకలో రావణుడ్ని చంపిన రోజు కూడా దశమే. రాముడిని మనం దేవుడిగా భావిస్తాం... రావణుడు అంటే రాక్షసుడు. అంటే చెడుపై మంచి గెలవడం అనేది రామాయణ కథనం. ఆ రోజున తెలంగాణలోని మైదానాల్లో రావణుడి దహన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అంతెత్తున పది తలల రావణుడి బొమ్మను చేసి, ఆ బొమ్మను బాణాసంచాతో కాలుస్తారు. ఇది కూడా చాలా ప్రాంతాల్లో ఒక పెద్ద పండుగలాగే చేస్తారు. దసరా తర్వాత ఇరవై ఒక్క రోజులకు దీపావళి వస్తుంది. రావణుడ్ని చంపిన తర్వాత రాముడు తన పరివారంతో అయోధ్యను చేరింది ఆశ్వయుజ మాసం దశమి రోజే కావడం వల్ల విజయదశమిని జరుపుకుంటారు..
గ్రామీణ ప్రాంతాలతో పాటు, పట్టణ ప్రాంతాల్లోనూ కులవృత్తులు చేసేవారితో పాటు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధమే వారికి జీవితాన్నిస్తుంది. ఆయుధం అంటే అది పెన్ను కావచ్చు, కత్తులు, వ్యవసాయ పనిముట్లు, వాహనాలు, మెషీన్ కావొచ్చు, రైతులకైతే నాగలి, కొడవలి కావొచ్చు, పిల్లలకు చదువుకునే పుస్తకాలు కూడా కావొచ్చు. ఆయుధ పూజ చేయించడం ద్వారా విజయం సాధిస్తామని నమ్ముతారు.పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీది నుంచి తీసిన రోజు దసరానే. అందుకే ఈ రోజున ఎవ్వరికి వాళ్లు తమ ఆయుధాలకు ఆయుధ పూజ చేస్తారు.
ఇది కూడా చూడండి: Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. రెండు రోజులు దంచుడే దంచుడు