/rtv/media/media_files/2025/10/04/constable-cheats-2025-10-04-20-50-46.jpg)
Constable cheats..young woman dies
Crime : మూడు నెలలుగా ప్రియుడి ఇంటి ఎదుట నిరసన తెలుపుతున్న యువతి అనుమానస్పదంగా మృతి చెందటం కలకలం రేపింది. ఈ ఘటన గద్వాల జిల్లా గట్టు చిన్నోనిపల్లెలో చోటు చేసుకుంది. పాల్వంచకు చెందిన ప్రియాంక చిన్నోనిపల్లెకు చెందిన రఘునాథ్ గౌడ్ అనే కానిస్టేబుల్ అయిన యువకుడితో ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. సుమారు నాలుగేళ్లుగా వారు ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత యువకుడు ఆమెను దూరం పెట్టడంతో భరించలేకపోయిన ప్రియాంక ఆ యువకుడి ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవాలని అడిగింది. దానికి ఆయన నిరాకరించడంతో ప్రియుడి ఇంటి ఎదుటే నిరసనకు దిగింది. గడచిన మూడు నెలలగా ప్రియాంక కానిస్టేబుల్ ఇంటి ఎదుట నిరసన చేస్తోంది.
తనను ప్రేమించి పెళ్లి చేసుకోమంటే చేసుకోకుండా మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ ప్రియాంక గతంలోనే గద్వాల జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రఘునాథ్ గౌడ్ పై చీటింగ్ కేసు నమోదు కాగా ఆ యువకుడు జైలుకు వెళ్లి ఇటీవల విడుదల అయ్యాడు. అయితే అప్పటి నుంచి ప్రియాంక ఆ యువకుడి ఇంటి ఎదుటే దీక్ష కొనసాగిస్తోంది. రెండు రోజుల క్రితం తనను పెండ్లి చేసుకోవాలని మరోసారి కోరగా రఘునాథ్ గౌడ్ నిరాకరించడంతో ప్రియాంక పురుగుల మందు తాగింది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను గద్వాల ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం తిరిగి చిన్నోనిపల్లె గ్రామానికి చేరుకొని రఘునాథ్ గౌడ్ ఇంటి ఎదుట తిరిగి దీక్ష కొనసాగించింది. ఇవాళ ఉదయం అకస్మాత్తుగా ప్రియాంక మృతి చెందింది. రఘునాథ్ బంధువులే ప్రియాంకను చంపేశారని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతుండడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రియాంక మృతి చెందటంతో ఆమె బంధువులు, స్థానికులు రఘునాథ్ గౌడ్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: నీరవ్ మోదీకి బిగ్ షాక్.. మరికొన్ని రోజుల్లోనే భారత్కు అప్పగింత