/rtv/media/media_files/2025/02/04/ll3HZJdPZA5PI9BmFOvh.jpg)
AZAMJAHI MILLS
Azanjahi's lands : వేలాదిమంది కార్మికులకు అండగా, వందలాది పోరాటాలకు కేంద్రంగా నిలిచిన వరంగల్లోని అజంజాహి మిల్లు భూముల విషయంలో ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది. అక్కడి కార్మిక భవన్ను కూల్చివేసి ఆ భూములు తనవేనంటూ ఓ వస్త్రవ్యాపారి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేశాడు. దీనికి స్థానికమంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు దగ్గరుండి ఆ పూజల్లో పాల్గొనటం రాజకీయ రగడకు తెరలేపింది. కోట్ల రూపాయల విలువైన కార్మికుల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతిపక్ష పార్టీలతో పాటు కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో ఆ భూములు కార్మికులకే చెందాలంటూ మావోయిస్టు పార్టీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ జయశంకర్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి (జేఎండబ్ల్యూపీ) డివిజన్ కార్యదర్శి కంకణాల రాజిరెడ్డి ఆలియస్ వెంకటేష్ అలియాస్ ధర్మన్న లేఖ విడుదల చేశారు. అజంజాహి మిల్లును పథకం ప్రకారం దివాలా తీయించి 451 మంది కార్మికులకు 2002లో బలవంతంగా స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ఇచ్చి మూసివేశారని ఆయన ఆరోపించారు.
Also Read : Basti Ali : అభిషేక్ నీ ఆటకు ఫిదా.. పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు
2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 117 ఎకరాల 20 గుంటల మిల్లు భూములను కుడా ద్వారా స్వాధీనం చేసుకుని దానిలో ఏపీ హౌజింగ్ బోర్డుకు 65 ఎకరాలు, రాంకీ, హ్యాండ్ల్యూమ్ కార్పొరేషన్ సంస్థలకు 30 ఎకరాలు విక్రయించిందని తెలిపారు. న్యాయబద్ధంగా 226 ఎకరాల భూమి న్యాయబద్ధంగా కార్మికులకే చెందాలని అందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. కొంతమంది అధికార పార్టీ నాయకులు ప్రభుత్వం అండతో ఓం నమఃశివాయ, గొట్టెముక్కుల నరేందర్ మిల్లు భూములను కబ్జా చేసి ఇండ్లు నిర్మించి అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నారని వెంకటేష్ ఆరోపించారు. అసంఘటిత కార్మిక సంఘం పేరుతో సుద్దాల నాగరాజు సెటిల్మెంట్లు చెస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆయన ఆరోపించారు. ఇప్పటికైన ప్రభుత్వం ఆ భూములను కార్మికులకే వదిలేయాలని డిమాండ్ చేశారు.
నిజాం హయాంలో తెలంగాణలోనే అతిపెద్ద వస్త్ర పరిశ్రమగా వెలుగొందింది అజంజాహి మిల్లు. ఈ మిల్లులో పని చేసే కార్మికులు 1944లో సుమారు ఆరువందల గజాల స్థలంలో కార్మిక భవన్ను నిర్మించుకున్నారు. వారంతా కూడా తమ వేతనాల నుంచి కొంతమొత్తాన్ని చెల్లించి ఈ భవన్ను నిర్మించుకున్నారు. 2003లో అజంజాహి మిల్లు మూతపడింది. దీంతో అందులో పనిచేసే కార్మికులు చాలామంది వీఆర్ఎస్ తీసుకున్నారు. అయితే అజంజాహి మిల్లు నే నమ్ముకున్న కార్మికులు.. కార్మిక భవన్ స్థలంలో తమకు ప్లాట్లు కేటాయించాలని కోరుతూ వస్తున్నారు. అయితే, కార్మిక భవన్ కాగితాలు సరిగా లేకపోవడంతో రాజకీయ నాయకులకు వరంగా మారింది. దానిపై నకిలీ పత్రాలు సృష్టించి నగరంలోని ఓ ప్రముఖ వస్త్రవ్యాపారికి ఆ భూమిని తక్కువ ధరకు విక్రయించారు. వస్త్ర వ్యాపారిని మావోయిస్టు పార్టీ హెచ్చరించడంతో అక్కడ నిర్మాణాలకు వెనుకడుగు వేశాడు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కార్మిక భవన్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళీధర్రావు హాజరవడం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మికభవన్ స్థలం కార్మికులదే అంటూ వారికి అండగా నిలిచిన మురళి ప్రస్తుతం వస్త్ర వ్యాపారితో కలిసి భూమి పూజలో పాల్గొనటం రాజకీయ రగడకు తెరలేపింది. దీంతో మరోకసారి మావోయిస్టు పార్టీ అల్టిమేటం జారీ చేయడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.