/rtv/media/media_files/2025/09/10/ktr-arrest-in-formula-e-car-race-scam-2025-09-10-17-12-04.jpg)
KTR Arrest In Formula E Car Race Scam
Formula ERace : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి తెలంగాణ ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) దర్యాప్తు లో దూకుడు పెంచింది. -ఈ కారు రేసులో క్విడ్ ప్రోకో జరిగిందని ఏసీబీ నిర్ధారణకు వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఈ కేసులో గడచిన 9 నెలలుగా దర్యాప్తు చేస్తున్న ఏసీబీ కీలక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలోని అంశాల ఆధారంగా, అప్పటి మంత్రి కేటీఆర్తో పాటు ఇతరులపై ఛార్జిషీట్ దాఖలు చేయడానికి ఏసీబీ అనుమతి కోరింది. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఫార్ములా రేసింగ్ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం హెచ్ఎండీఏ ఖాతా నుంచి రూ.45 కోట్ల నిధులను ఫార్ములా ఈ కారు రేస్లో భాగస్వాములైన కంపెనీకి బదిలీ చేసింది, అయితే తిరిగి ఆ కంపెనీల నుంచి బీఆర్ఎస్ పార్టీ కి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తిరిగి రూ.44 కోట్ల నిధులు వచ్చినట్లు ఏసీబీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఏసీబీ పలు ఆధారాలను సేకరించిందని తెలుస్తోంది. క్విడ్ ప్రో కో కారణంగానే ఫార్ములా రేసింగ్లో ఏ మాత్రం అనుభవం లేని ఏస్ నెక్ట్స్జెన్ భాగస్వామి అయ్యిందని ఏసీబీ అధికారులు తేల్చి చెప్పారు.
ఫార్ములా రేసింగ్ లో గత ఏడాది డిసెంబరు 19న కేటీఆర్తో పాటు పలువురిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు గవర్నర్ అనుమతి కోరింది. దీనికి గవర్నర్ డిసెంబరు16న అనుమతించారు. ఆ తర్వాత డిసెంబరు18న ఏసీబీ అధికారులు ఫిర్యాదుదారుడైన దానకిశోర్ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆ తరువాతి రోజు డిసెంబరు19న అధికార దుర్వినియోగానికి సంబంధించి కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్ఎన్రెడ్డి, మరో రెండు సంస్ధలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీని ప్రకారం 2023లో హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కారు రేసు వ్యవహరంలో నాటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ సచివాలయ బిజినెస్ రూల్స్ ఉల్లంఘించి హెచ్ఎండీఏ నిధుల నుంచి రూ.45 కోట్లను ఎఫ్ఈఓకు పంపించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అంతేకాక ఆ డబ్బులు సైతం విదేశీ కరెన్సీ రూపంలో పంపారని, దానికి ఆర్బీఐ అనుమతి తీసుకోవలసి ఉండగా అలా చేయలేదని తేల్చారు. దీనివల్ల విదేశీ కరెన్సీ చెల్లింపులు వల్ల దాదాపు ఏడు కోట్ల రూపాయలను ఐటీకి హెచ్ఎండీఏ చెల్లించాల్సి వచ్చిందని ఏసీబీ అధికారులు తేల్చి చెప్పారు.
కాగా, ఈ కేసులో ఏసీబీ, అప్పటి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను నాలుగు సార్లు, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఐదు సార్లు విచారించింది. వీరితో పాటు బీఎల్ఎన్ రెడ్డి, కిరణ్ రావు, ఫార్ములా ఈ ఆర్గనైజర్లను (FEOలు) కూడా ఏసీబీ విచారించింది. ఏసీబీ విచారణలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో క్విడ్ ప్రో కో జరిగిందని ఏసీబీ నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ రేసుకు స్పాన్సర్గా ఉన్న కంపెనీ, అప్పటి అధికార పార్టీకి రూ. 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను చెల్లించినట్లు ఏసీబీ గుర్తించింది. దీంతో ఈ కేసులో కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నివేదికను గవర్నర్కు కూడా ఏసీబీ అందజేసినట్లు సమాచారం.
సుప్రీం లో కేటీఆర్కు చుక్కెదురు
కాగా, ఏసీబీ ఎఫ్ఐఆర్ను కొట్టి వేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు కేసు కొట్టి వేయకుండా కేవలం అరెస్టు చేయకుండా మధ్యంతర ఆదేశాలు మాత్రం ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ అభ్యర్థించారు. ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది. ఈ కేసులో విచారణ అవసరమని, పిటిషన్ను ఉపసంహిస్తున్నట్లుగా పరిగణిస్తూ కొట్టేస్తున్నామని ఈ ఏడాది సెప్టెంబరు 2న ప్రకటించింది. సుప్రీంకోర్టు కేటీఆర్ పిటిషన్ను తిరస్కరించిన వెంటనే ఏసీబీ అధికారులు స్పీడ్ పెంచారు. ఇప్పటి వరకు సేకరించిన సాంకేతిక ఆధారాలతో ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ పంపించారు.
హరీష్ రావుతో కేటీఆర్ భేటీ
కాగా, ఫార్ములా ఈ కారు రేస్ కేసు నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎసీబీ కేసు విషయంలో ఏం చేయాలనే దానిపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హరీష్ రావు నివాసానికి చేరుకున్న కేటీఆర్ ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు వెళితే ఏం చేయాలనే దానిపై చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే ఉపకరించిందని, ఇందులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని కేటీఆర్ అంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.
Also Read : ఛీఛీ వెధవలు.. 16 ఏళ్ల బాలుడ్ని రేప్ చేసిన మరో మైనర్, యువకుడు.. వీడియో తీసి..