/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
suicide
Crime News: వారిద్దరిది ఒకే ఊరు.. కానీ కులాలు వేరు...అయినా ప్రేమించుకున్నారు. పెద్దలను కాదని ఇంట్లోంచి వెళ్లిపోయారు. కానీ, పెద్దలు వారికి సర్దిచెప్పి ఇంటికి తీసుకువచ్చారు. కొంతకాలం గడిచింది. అబ్బాయి వేరే పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి మరో వృత్తిలో స్థిరపడింది. ఇంతవరకు బానే ఉన్నా...ఈ రాఖీ పౌర్ణమి మళ్లీ ఇద్దరిని కలిపింది. కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. వైజాగ్ వెళ్లిపోయారు. కానీ, అనుహ్యంగా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది...మరీ ఆ అబ్బాయి ఏమయ్యాడు.. తెలియాలంటే ఈ కథనం చదవండి...
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ కు చెందిన మేడే నరేశ్, కొర్లపూడి రమ్య ఇద్దరు గత కొన్నేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. తమ ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. కానీ,పెద్దలు వారిని తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఆ సమయంలో యువతి మైనర్ కావడం, కులాలు కూడా వేరు కావడంతో వారి కుటుంబ సభ్యులు పెండ్లికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. రమ్య, నరేష్ కలవడం మాట్లాడుకోవడం, కలుసుకోవడం కానీ చేయరాదని పెద్దల సమక్షంలో తీర్మానించారు. అలా కొంతకాలం గడించింది. నరేష్ తల్లిదండ్రులు అతనికి, వేరే యువతితో పెండ్లీ జరిపించారు. అదే సమయంలో ఇంటర్ వరకు చదివిన రమ్య ఈ గొడవతో చదువు ఆపేయాల్సి వచ్చింది. కొంతకాలం గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్లిన రమ్య ఆ తర్వాత, హైదరాబాద్ చేరుకుని ఓ మెడికల్ షాప్ లో పనిచేస్తుంది. నరేష్ సైతం హైదరాబాద్ చేరుకుని మెడికల్ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. నరేష్ పెండ్లి అనంతరం ప్రేమ వ్యవహారం మర్చిపోయి, రమ్య, నరేష్ ఎవరి పని వారు చేసుకుంటున్నారని అందరూ అనుకున్నారు. అక్కడ ఇద్దరు కలుసుకున్నది లేనిది తెలియదు కానీ ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా ఇద్దరూ తిరిగి గ్రామానికి వెళ్లారు.
రాఖీ పండుగ ముగిసిన అనంతరం రమ్య హైదరాబాద్ తిరిగి వెళ్తున్నాననీ ఇంట్లో చెప్పి బయలుదేరింది. అప్పటికే ఫోన్ కాంటాక్ట్ లో ఉన్న నరేష్ సూర్యాపేటలో రమ్యను కలిశాడు. మళ్లీ ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. అటునుంచి అటే వైజాగ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ మొబల్ స్విజ్ ఆఫ్ చేశారు.వెళ్తూ వెళ్తూ విజయవాడలో ఆగి నరేష్ రమ్య మెడలో తాళి కట్టాడు. అనంతరం అక్కడి నుంచి వైజాగ్ చేరుకున్న వాళ్ళు, టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ రూమ్ రెంటుకు తీసుకొని ఆ రూమ్ లో ఉంటున్నారు. ఇక్కడి వరకు బానే ఉన్నా ఈ నెల 22న నరేష్ తన మ్యారేజ్ డే సందర్భంగా, రమ్యను వైజాగ్ లోనే ఉంచి, నరేశ్ ఖమ్మం వచ్చి మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నట్లు తెలిసింది.
అయితే ఖమ్మం వచ్చిన నరేష్ తిరిగి వైజాగ్ వెళ్లలేదు. పైగా రమ్య ఎన్నిసార్లు కాల్ చేసినా, మెసేజ్ లు పెట్టినా సమాధానం ఇవ్వలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన రమ్య, మనస్థాపానికి గురై సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వైజాగ్ పోలీసులు.. మృతురాలు వద్ద లభ్యమైన లగేజ్ బ్యాగ్, మొబైల్ ఫోన్ ఆధారంగా,తిరుమలాయపాలెం మండలంలోని, ఎర్రగడ్డ గ్రామానికి చెందిన యువతి గా గుర్తించారు. వెంటనే స్థానిక ఎస్సై కూచిపూడి జగదీష్ కు సమాచారం తెలిపారు. విచారణ చేపట్టిన ఎస్సై జగదీష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులతోపాటు, పోలీస్ స్టేషన్ సిబ్బందిని సైతం వైజాగ్ పంపించారు. అక్కడే రమ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం, స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇదిలా ఉంటే.. రాఖీ పండుగ అనంతరం నరేష్ కనిపించకుండా పోయాడని నరేష్ తల్లిదండ్రులు ఇటీవల స్థానిక తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు సైతం పెట్టారు. విచారణ సైతం చేపట్టినట్లు ఎస్సై జగదీష్ తెలిపారు. అయితే 22న నరేష్ తిరిగి ఖమ్మం వచ్చిన తర్వాత ఏం జరిగింది. మిస్సయిన నరేష్ తిరిగి వచ్చినట్లు పోలీసులకు సమాచారం లేదా? తిరిగి వచ్చిన నరేష్ ఇంట్లో వారికి ఏం చెప్పాడు. రమ్య పోన్ ఎత్తకపోవడానికి కారణం ఏంటీ ? అనేది చిక్కువీడని ప్రశ్నలుగా మిగిలాయి. అదే సమయంలో వైజాగ్ పోలీసులు నరేష్ ను విచారించడానికి ఖమ్మం వచ్చినట్లు తెలిసింది. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇంతకు రమ్య సూసైడ్ లెటర్లో ఏముంది అనేది తెలియాల్సి ఉంది.