Telangana : తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం.. సెంటిమెంట్‌తో కొడుతున్న బీఆర్ఎస్‌

రాష్ట్రంలో ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహం అంశం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల సచివాలయంలో రాజీవ్‌ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తానన్న రేవంత్‌ను బీఆర్‌ఎస్‌ విమర్శించింది. దీంతో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు సీఎం ముందుకొచ్చారు.

Telangana : తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం.. సెంటిమెంట్‌తో కొడుతున్న బీఆర్ఎస్‌
New Update

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి.. రాష్ట్రం సాధించాకా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఓటమి వల్ల బీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. అలాగే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవకపోవడంతో.. ఆ పార్టీ గ్రాఫ్‌ మరింత దిగజారిపోయింది. ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో తీర్థం పుచ్చుకున్నారు. అధికారం కోల్పోయినప్పటికీ బీఆర్ఎస్‌.. రేవంత్‌ సర్కార్‌ను ప్రశ్నిస్తూనే ఉంది. ఆరు గ్యారెంటీల హామీలపై ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంది. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు కూడా గతంలో చేసిన బీఆర్‌ఎస్‌ తప్పులను ఎత్తిచూపుతూ కౌంటర్‌ ఎటాక్‌లు చేస్తున్నారు.

తెలంగాణ సెంటిమెంట్‌తో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ పార్టీ.. ఇప్పుడు మళ్లీ ఆ సెంటిమెంట్‌తోనే రాష్ట్రంలో తమ గ్రాఫ్‌ను పెంచుకునేందుకు యత్నిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహం అంశం రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది. ఇటీవల సీఎం రేవంత్‌.. సచివాలయం ఎదుట మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటన చేశారు. దీనిపై బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. అలాగే దీనిపై స్పందించిన కేటీఆర్‌.. ఆ ప్రదేశంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తాము అధికారంలోకి వచ్చాక తొలగిస్తామని వ్యాఖ్యానించారు. అలాగే శంషాబాద్‌లో ఉన్న రాజీవ్ గాంధీ విమానశ్రయం పేరు కూడా మారుస్తామంటూ ఖరాఖండీగా చెప్పారు.

Also read: బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ‘మేఘా’ కాంప్రమైజ్.. పైడి రాకేష్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ

ఆ తర్వాత కేటీఆర్‌ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు. రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ కౌంటర్ వేశారు. అక్కడ మీ నాయన విగ్రహం పెట్టడానికి ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తీస్తావా?.. కలలో కూడా నీకు అధికారం రాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గుర్తుకు వచ్చిందా అంటూ ఎద్దేవా చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ నాయకులు రేవంత్‌పై తీవ్రంగా మండిపడ్డారు. డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పాలని కేసీఆర్‌ ప్రభుత్వం సంకల్సిస్తే.. ఆ ప్రదేశంలో రేవంత్‌ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి సన్నహాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ నిర్ణయంపై రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోందని.. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ స్థానంలో తెలంగాణ తల్లిన తప్ప వేరెవరిని తెలంగాణ సమాజం ఒప్పుకోదంటూ చురకలంటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. ఇలా చేస్తే ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని రేవంత్ సర్కార్‌ ముందుగానే గ్రహించినట్లు తెలుస్తోంది. దీంతో సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టిస్తామని సీఎం రేవంత్ ప్రకటన చేశారు. అలాగే సచివాలయం ఎంట్రన్స్‌ గేటు వద్ద రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.  దీంతో మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీ కొత్త ఆరోపణలు చేసింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ప్రవేశం గేటు దగ్గరే.. రాజీవ్‌ గాంధీ విగ్రహం కాకుండా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. అక్కడ విగ్రహం ఉంటేనే అందరికీ కనిపిస్తోందని చెబుతోంది.

మరోవైపు రేవంత్ సర్కార్‌.. సచివాలయం లోపల ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కతో కలిసి అక్కడ స్థల పరిశీలన చేశారు. విగ్రహ ఏర్పాటుకు ప్రదేశానికి అనుగుణమైన డిజైన్‌ కూర్పుపై అధికారులతో కూడా సమావేశం నిర్వహించారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహాం డిజైన్‌కు కూడా రేవంత్ ప్రభుత్వం మార్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ.. ఓ చేతిలో బతుకమ్మ, మరో చేతిలో మొక్కజొన్న, ఒంటిపై బంగారు నగలు ఉండే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించింది.

Also read: జన్వాడ ఫాంహౌస్ కూల్చివేత.. హైడ్రాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

అయితే కాంగ్రెస్ మాత్రం.. తెలంగాణ తల్లిపై నగలు ఉండటం ఏంటని ప్రశ్నిస్తోంది. తెలంగాణ తల్లి అంటే గడిలో దొరసాని కాదని చెబుతోంది.  చివరికి తాము రూపొందిన విగ్రహాన్నే అక్కడ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. కాంగ్రెస్‌ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహానికి ఓ చేతిలో మొక్కజొన్న ఉంటుంది. మరో చేయి అభయం ఇస్తుంది. ఒంటిపై ఎలాంటి బంగారు నగలు ఉండవు. మెడలో ఓ సాధారణ కడియం లాంటిది ఉంటుంది. ఒకవేళ రేవంత్ ప్రభుత్వం.. ఇలా తాము రూపొందించిన విగ్రహాన్నే ఏర్పాటు చేస్తే అప్పడు కూడా మళ్లీ బీఆర్‌ఎస్‌ దీనిపై అభ్యంతరం తెలిపే ఛాన్స్ ఉంది. ఎప్పటినుంచో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ అవమానించిందంటూ విమర్శలు చేసే అవకాశం ఉంది. ఇలా ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణ సెంటిమెంట్‌తో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రయత్నాలు చేస్తోంది. మరి సచివాలయంలో ఏ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

#cm-revanth #ktr #brs #telugu-news #congress #kcr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి