DK Aruna: రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది

సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు డీకే అరుణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ నియంతలా మారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ పాలనలో విపక్షనేతలు రోడ్లపై తిరిగినా తప్పే అవుతుందని విమర్శించారు.

New Update
DK Aruna: రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది

రాష్ట్రంలో రౌడీ పాలన నడుస్తోందని జాతీయ బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా గత ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు. అతడ్ని పరామర్శించడానికి వెళ్తే అడ్డుకోవడమేంటని ఆమె ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వమని, సీఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తోన్నారని డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నిర్మల్‌ వస్తున్నానని తెలిసే పోలీసులు అక్కడ 144 సెక్షన్‌ అములు చేశారని ఆరోపించారు. ఇందలవాయి వద్ద పోలీసులు తనను అడ్డుకున్నారని డీకే అరుణ తెలిపారు. 144 సెక్షన్‌ అమలులో ఉందని, అక్కడికి వెళ్లడానికి అనుమతి లేదని పోలీసులు తనను బలవంతంగా అరెస్ట్‌ చేశారన్నారు.

తెలంగాణ భూములను కేసీఆర్‌ దోచుకుంటున్నారని డీకే అరుణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాళేశ్వరం పేరుతో దోచుకోవడం అయిపోయిందన్న ఆమె.. ఇప్పుడు మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో రైతుల భూములను దోచుకోవడం ప్రారంభించారని మండిపడ్డారు. కేసీఆర్‌ రైతు రుణమాఫి చేయడానికే మద్యం టెండర్లను ప్రారంభించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్న ఆమె.. రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్‌కు సిగ్గుండాలని విమర్శించారు. రాష్ట్రంలో కేంద్ర పథకాలు పక్కతోవ పడుతున్నాయని ఆరోపించారు.

రానున్న రోజుల్లో తాము ప్రజల్లోకి వెళ్తామని డీకే అరుణ తెలిపారు. గ్రామ స్థాయి పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఎలా పక్కదారి పట్టాయే రుజువు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు కేసీఆర్‌ చేస్తున్న మోసాల గురించి వివరిస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తామని వివరించారు. కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలు బుద్ది చెప్పే సమయం ముందే ఉందని, కేసీఆర్‌ రానున్న ఎన్నికల అనంతరం గద్దె దిగడం ఖాయమని జోస్యం చెప్పారు.

Advertisment
తాజా కథనాలు