/rtv/media/media_files/2025/03/08/0bDTvT6TR5qZeq1zQrvU.jpg)
Delimitation
ప్రస్తుతం డీలిమిటేషన్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. దక్షిణాది రాష్ట్రాలు ఈ డీలిమిటేషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా ప్రాతిపాదికన జరిగే ఈ లోక్సభ పునర్విభజన ప్రక్రియ వల్ల ఉత్తరాది రాష్ట్రాలు లబ్ధి పొందుతాని.. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2026లో డీలిమిటేషన్ను చేపట్టాలని యోచిస్తోంది. అందుకే దక్షిణాది రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం స్టాలిన్ ఏడు రాష్ట్రాల సీఎంలకు, వివిధ పార్టీలకు లేఖలు రాశారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ విధానానికి వ్యతిరేకంగా ''జాయింట్ యాక్షన్ కమిటీ'' ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు. మార్చి 22న చెన్నైలో జరగనున్న జేఏసీ సమావేశానికి హాజరుకావాలని కోరారు. అసలేంటీ ఈ డీలిమిటేషన్. ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
డీలిమిటేషన్ అంటే ఏంటి ?
నియోజకవర్గం సరిహద్దులను నిర్ణయించి, ఏ నియోజకవర్గంలో ఎంతమంది జనాభా ఉండాలి.. ఏ గ్రామాలు, మండలాలు ఆ నియోజకవర్గంలో ఉండాలో నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియనే పునర్విభజన లేదా డీలిమిటేషన్ అని అంటారు. జనాభా లెక్కలు చేసిన అనంతరం ఈ డీలిమిటేషన్ను చేపడతారు. అయితే ఒక నియోజకవర్గంలో లక్ష మంది కలిసి ఒక ఎంపీని ఎన్నుకోవడం, మరో నియోజకవర్గంలో 25 లక్షల మంది ఒక ఎంపీని ఎన్నుకోవడం అనేది జరగదు. ప్రతీ ఓటుకి కూడా సమానంగా విలువ ఉండాలనే సిద్ధాంత ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో 30 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉన్నారు. కానీ తమిళనాడులో 18 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉన్నారు. ఇప్పుడు తమిళ ఓటర్ విలువ ఎక్కువగా, యూపీ ఓటర్ విలువ తక్కువగా ఉంటుంది.
ఇలా జరగకుండా ఉండేందుకు జనాభా ప్రాతిపదికన ఎప్పటికప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు. 1952, 1962, 1972, 2002లో పునర్విభజన సంఘాలు ఏర్పాటయ్యాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170 ప్రకారం జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు. ఇలా జరిగినప్పుడు ఆయా రాష్ట్రంలో సీట్ల సంఖ్య పెంచడం లేదా తగ్గించడం ఉంటుంది. మనదేశంలో మొదటిసారిగా 1952లో లోక్సభ ఏర్పడింది. అప్పుడు కేవలం 489 మంది ఎంపీలు మాత్రమే ఉండేవారు. 1972లో చేపట్టిన డీలిమిటేషన్ ద్వారా ఆ సంఖ్య 545కి పెరిగింది.
Also Read: సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ
ప్రస్తుత సీట్లు 1971 నాటివే
ప్రస్తుతం ఉన్న ఈ లోక్సభ సీట్లు 1971 జనాభా లెక్కల ప్రకారమే విభజించారు. అయితే ఆ సమయంలో అప్పటి కేంద్ర ప్రభుతం జనాభా నియంత్రణను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేశాయి. దీంతో 1972 తర్వాత దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాలు దీన్ని పాటించలేదు. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గగా.. ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగింది. దీంతో తర్వాతి డీలిమిటేషన్ వల్ల తమకు అన్యాయం జరగుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆరోపించాయి. ఇందుకోసం 1976లో ఓ రాజ్యంగ సవరణ చేశారు. నియోజకవర్గ సరిహద్దులు ఎలా అయినా మార్చవచ్చని.. కానీ ఎంపీల సంఖ్యను మార్చకూడదనే సవరణ చేశారు. దీనివల్ల జనాభా పెరుగుదల, తగ్గుదలతో సంబంధం లేకుండానే ఆయా రాష్ట్రాల ఎంపీల సంఖ్య అలాగే ఉంటుంది. దీనికి 25 ఏళ్ల డెడ్లైన్ కూడా పెట్టారు. దీంతో 2001 వరకు ఇది ఇలానే కొనసాగింది.
2001లో కూడా సరిహద్దును మర్చారు గానీ నియోజకవర్గాల సంఖ్యను మార్చలేదు.1971 జనాభా లెక్కల ప్రకారమే లోక్సభ సీట్లు అలానే ఉన్నాయి. 2001లోనే.. 1976లో తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణను మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. అంటే 2026 వరకు. 2026 తర్వాత చేపట్టే డీలిమిటేషన్ వల్ల ఆయా రాష్ట్రాలకు ఎంపీల సంఖ్యను మార్చే అధికారం కేంద్రానికి ఉంటుంది. అందుకే దీనిపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరో 30 ఏళ్ల పాటు ఈ డెడ్లైన్ను పొడిగించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు
2026లో కేంద్రం జనాభా లెక్కలు చేపట్టనుంది. వాస్తవానికి 2021లోనే చేపట్టాల్సి ఉన్నా కొవిడ్ వల్ల అది వాయిదా పడింది. 2026లో జనాభా లెక్కల ప్రక్రియ తర్వాత డీలిమిటేషన్ జరుగుతుంది. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వస్తాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2026 జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్ జరిగితే ఉత్తరప్రదేశ్కు ప్రస్తుతం ఉన్న 80 ఎంపీ సీట్ల సంఖ్య 143 సీట్లకు పెరుగుతుంది. బీహార్కు 40 నుంచి 79 సీట్లు, రాజస్థాన్కు 25 నుంచి 50, మహారాష్ట్రకు 48 నుంచి 73, గుజరాత్కు 26 నుంచి 53 పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా మొత్తంగా చూసుకుంటే ఉత్తరాది రాష్ట్రాలకు ఎంపీ సీట్ల సంఖ్య పెరుగుతుంది.
Also Read: ఈరోజు స్పెషల్ ఇదే.. మహిళల చేతికి మోదీ సోషల్ మీడియా అకౌంట్లు
కానీ తెలంగాణకు 17 నుంచి 23, ఆంధ్రప్రదేశ్కు 25 నుంచి 31, కర్ణాటక 28 నుంచి 41, తమిళనాడు 39 నుంచి 49, కేరళకు 20 నుంచి 20 స్థానాలనే పరిమతమైపోతుందనే అంచనాలు ఉన్నాయి. దీనివల్ల ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ ఎంపీ సీట్లు వస్తాయి. దేశం మొత్తంలో లోక్సభ సీట్ల సంఖ్య 848కి చేరుతుంది. అయితే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల నుంచి మొత్తం ఎంపీ సీట్లు 164 అయితే..ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచే 222 మంది ఎంపీలు వస్తారు. దీనివల్ల కేంద్రంలో, పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గుతుందనే ప్రచారం నడుస్తోంది. అందుకే డీలిమిటేషన్ను దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.