/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/info-jpg.webp)
దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఒకే రోజు వందల మందిని ఉద్యోగం నుంచి తీసేయడం తో పాటు అనంతరం వారిపట్ల సెక్యూరిటీ గార్డులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుంది. మైసూరు క్యాంపస్లో 400 మందికిపైగా ట్రెయినీలను ఇన్ఫోసిస్ సంస్థ రెండు రోజుల కిందట తొలగించింది. ఈ వ్యవహారంపై దుమారం రేగడంతో కేంద్ర కార్మిక శాఖ తాజాగా మాట్లాడింది.
ఆ సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర కార్మిక శాఖ కమిషన్ లేఖ విడుదల చేసింది. ఉద్యోగుల సామూహిక తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోవాలని సూచించింది.
ఒకేసారి 400 మంది ట్రెయినీలను తొలగించిన ఇన్ఫోసిస్ యాజమాన్యం.. క్యాంపస్ నుంచి సెక్యూరిటీ సిబ్బంది ద్వారా వారిని బయటకు పంపింది. ఈ అంశంపై బాధితులు, ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ఎన్ఐటీఈఎస్) కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదుఅందించారు. ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం.. కర్ణాటక సర్కారును జోక్యం చేసుకోవాలని కోరింది.
ఎక్కడకు వెళ్లాలని..
రాత్రివేళలో తమను బయటకు పంపితే ఎక్కడకు వెళ్లాలని.. ఈ ఒక్క రాత్రికి హాస్టల్లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని మధ్యప్రదేశ్కు చెందిన ఓ యువతి కాళ్లావేళ్లాపడి బతిమలాడినా కంపెనీ నిరాకరించింది. పలు రాష్ట్రాలకు చెందిన ఈ ట్రెయినీలు క్యాంపస్ బయట రాత్రంతా రోడ్డుపైనే గడిపిన వీడియోలు, ఫోటోలు సొషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరోవైపు, తమ చర్యను ఇన్ఫోసిస్ సమర్దించుకుంది. సంస్థలో నియామక ప్రక్రియ కఠినంగా ఉంటుందని ఇన్ఫోసిస్ ప్రతినిధులు ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. మైసూరు క్యాంపస్లో ప్రాథమిక శిక్షణ తర్వాత నిర్వహించే ఇంటర్నల్ పరీక్షల్లో అర్హత సాధించాల్సి ఉంటుందన్నారు. వారికి మూడు అవకాశాలు ఉంటాయని, అందులో ఉత్తీర్ణులు కాకుంటే ఉద్యోగంలో కొనసాగే వీలుండదని అన్నారు. ఈ మేరకు ముందుగానే వారితో ఒప్పందం కూడా చేసుకుంటామని తెలిపారు.
కాగా, ఫిబ్రవరి 7న ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ట్రెయినీ సాఫ్ట్వేర్ ఇంజినీర్లను 2022లో ఇన్ఫోసిస్ ఉద్యోగంలోకి తీసుకుంది. కానీ, మూడేళ్లకే వారిని ఉద్యోగం నుంచి తొలగించింది.