/rtv/media/media_files/2025/06/12/oj9GPjSkcnBJft86wXSp.jpg)
Air India Plane Crash
ఒక్కో ప్రమాదం జరిగినపుడు ఆ ప్రమాదానికి గురైన వారి జీవితాల వెనుక ఎన్నో విషాదాలు వెలుగు చూస్తాయి. ఎన్నో కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగుల్చుతాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలోనూ మరణించినవారి కుటుంబాల్లో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఈ ప్రమాదం ఎంతోమంది కలలను చిదిమేసింది. అందులో రాజస్థాన్ కు చెందిన నవవధువు ఖుష్భూ ఒకరు. రాజస్థాన్లోని బలోత్రా జిల్లాలోని అరబా దుదావత గ్రామానికి చెందిన ఖుష్బూ కన్వర్ కు జనవరి 18న ఖరబీరా పురోహితన్ లుని నివాసి అయిన మన్ఫూల్ సింగ్ రాజ్పురోహిత్తో వివాహం జరిగింది.
ఆమె భర్త లండన్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు. వీసా , ఇతర పత్రాలను పూర్తి చేసిన తర్వాత ఖుష్బూ మొదటిసారి తన భర్తను కలవడానికి లండన్కు వెళుతోంది. ఈ క్రమంలో భర్తను కలుసుకునేందుకు ఖుష్బూ బయలు దేరింది. పెళ్లి తర్వాత తొలిసారి తన భర్తను కలిసేందుకు వెళ్తూ నిండు నూరేళ్లు భర్తతో జీవితం పంచుకోవాలని ఎన్నో కలలు కన్నది. చెరగని చిరునవ్వుతో...ఇక మీదట భర్తతో చేసే కొత్త ప్రయాణం గురించి ఎన్నో కలలు కంటూ విమానమెక్కింది. కానీ ఈ విమానం గమ్యాన్ని చేరకముందే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె చనిపోయి ఉంటుందని కుటుంబ సభ్యులు, పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆమె జాడ తెలియక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లి పందిట్లో భర్త వెంట ఏడడుగులు నడిచిన వధువు జీవితంలో ఆయన వెంటే నడవాలని బయలు దేరి అర్థంతరంగా తనువు చాలించింది. ఇప్పుడు ఆమె జాడ తెలియక ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఇండియాను వీడలేక వెళ్తూ...
ఇండియా పర్యటనకు వచ్చిన ఇద్దరు బ్రిటన్ జాతీయులు కూడా ఈ ప్రమాదంలో మరణించడం విషాదాన్ని నింపింది. బ్రిటన్ జాతీయులిద్దరూ గుజరాత్లో పర్యటించారు. అక్కడ వారు చూసిన జ్ఞాపకాలు, పొందిన అనుభూతులను తమతో పాటు తీసుకెళ్తూ మృత్యువాత పడ్డారు. లండన్ వెళ్లే విమానం ఎక్కి కూర్చున్న వారు విమానం బయలు దేరేముందు ఇన్స్టాగ్రామ్లో ఒక ఎమోషన్ పోస్టు పెట్టారు. ‘‘భారత్ పర్యటన ఎంతో బాగుంది. ఇక్కడ ఉన్నంత కాలం ఎన్నో సరదా క్షణాలు గడిపాం. మరికొన్ని గంటల్లో ఈ దేశాన్ని విడిచి వెళ్లడం బాధగా ఉంది. ఇక్కడ ఇదే మాకు చివరి రాత్రి. గుడ్బై ఇండియా’’ అంటూ వారు పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్గా మారింది. ప్రమాదం అనంతరం వారి పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాకుండా అందరినీ కలిచివేసింది.