/rtv/media/media_files/2025/02/07/OWHwVi1RU4agWcosYw9K.jpg)
NHAI issues show-cause notice to Megha Krishna Reddy
మేఘా కృష్ణారెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. భారత జాతీయ రహదారులు అధికార సంస్థ (NHAI) తాజాగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కేరళలోని జాతీయ రహదారి-17 పై చెంగాల నుంచి నీలేశ్వరం వరకు నిర్మించిన ఆరు లేన్ల రోడ్డులో నాణ్యతా లోపాలున్నాయనే కారణంతో ఈ నోటీసులు పంపించింది. అంతేకాదు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (IRC) నిబంధనలకు మేఘా కంపెనీ నిర్లక్ష్యం చేసిందని ఎన్హెచ్ఏఐ పరిశీలనలో తేలింది.
నిర్మాణం, డిజైన్లో చాలా లోపాలు
2022 అక్టోబర్ 9న Km. 72+297 (LHS) వద్ద వెహికిలర్ అండర్పాస్ డెక్ స్లాబ్ కూలిపోయింది. దీంతో ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఓ కమిటీ ఏర్పాటైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో, డిజైన్లో చాలా లోపాలున్నాయని అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని కమిటీ విచారణలో తేలింది. దీంతో చివరికీ ప్రాజెక్టు ఇంఛార్జ్, బ్రిడ్జ్ ఇంజినీర్ను సస్పెండ్ చేశారు. వీళ్లిద్దరూ కూడా ప్రస్తుతం పర్యవేక్షణలోనే ఉన్నారు. అంతేకాదు ఆ కాంట్రాక్టర్కు (మేఘా కంపెనీ) రూ.30 లక్షల ఫైన్ విధించారు. అలాగే ఇంజినీర్కు రూ.5 లక్షల జరిమానా విధించారు.
పట్టించుకోని మేఘా కంపెనీ
అలాగే మేఘా కంపెనీని తమ సొంత నిధులతో ఖర్చు పెట్టి ప్రాజెక్టును పునఃప్రారంభించాలని NHAI ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఐఆర్సీ, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (MORTH) నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెప్పింది. అయితే ఇలాంటి సూచనలు చేసినప్పటికీ కూడా 2024, మే 8న మరో ప్రమాదం జరిగింది. Km.78+971 వద్ద 20 మీటర్ల బ్రిడ్జిపై డెక్ స్లాబ్తో పాటు గిర్డర్లు జారీపడి కిందపడ్డాయి. ఈ ఘటన అక్కడి మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారమైంది. ప్రజలు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం వల్ల ఎన్హెచ్ఏఐ ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లింది.
మేఘా నిర్లక్యం వల్లే
అయితే మెఘా కంపెనీకి గానీ.. దీనికి సంబంధించిన డిజైన్ టీమ్ గాని ఈ సమస్యలను సరిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ రెండు ప్రమాదాలు కూడా ప్రాజెక్టు డిజైన్, దాన్ని అమలు చేయడంపై నిర్లక్ష్యం వహించడం వల్లే జరిగాయని అధికారులు తేల్చిచెప్పారు. అంతేకాదు మేఘా కృష్ణారెడ్డికి.. NHAI పాలసీలో రూల్ 1.3 (II) ప్రకారం రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఎందుకు జరిమామా విధించకూడదో వివరణ ఇవ్వాలని ఎన్హెచ్ఏఐ అధికారులు ఆదేశించారు. తాజాగా మేఘా కృష్ణారెడ్డికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.