కొంపముంచిన కాంగ్రెస్ అతివిశ్వాసం.. ఓటమికి ముఖ్య కారణాలివే

కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ బీజేపీ అనూహ్యంగా మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. కాంగ్రెస్ అతివిశ్వాసమే ఆ పార్టీకి దెబ్బతీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

modi and rahul 4
New Update

హర్యానా ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేసినప్పటికీ బీజేపీ అనూహ్యంగా మేజిక్ ఫిగర్‌ను దాటేసి అధికారం దిశగా వెళ్తోంది. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ సాధించిన మొదటి పార్టీగా నిలిచి రికార్డు సృష్టించింది. అయితే కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందనేదానిపై ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

కాంగ్రెస్‌లో విభేదాలు

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. దీంతో ఆయన తన మద్దతుదారుల్లో 72 మందికి టిక్కెట్లు ఇచ్చారని పార్టీలోనే విభేదాలు వచ్చాయి. దళిత నేత, ఎంపీ కుమారి సెల్జా అలాగే మరొకరు భూపిందర్ సింగ్ హుడా మధ్య విభేదాలతో కాంగ్రెస్‌ రెండుగా చీలింది. ఈ ఇద్దరు నేతలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ప్రయత్నించినప్పటికీ అవి ఫలించలేకపోయాయి. 

Also Read: కశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి సక్సెస్.. బీజేపీని బోల్తా కొట్టించిన 4 అంశాలివే!

దెబ్బతీసిన అతివిశ్వాసం, కులసమీకరణలు


మొదట్లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మకం పెట్టుకుంది. కానీ ఇది ఆ తర్వాత అతివిశ్వాసంగా మారింది. హర్యానాలో జాట్ కమ్యూనిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాదాపు 35 నుంచి 40 సీట్లలో జాట్‌లపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుందనే భావన చాలామందిలో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ 35 మంది జాట్ అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. అయినప్పటికీ ఇది ఫలించలేదు. ఐఎన్‌ఎల్‌డీ బరిలోకి దింపిన జాట్‌ అభ్యర్థుల్లో కన్నా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జాట్‌ అభ్యర్థులే తక్కవ స్థానాల్లో గెలిచారు. జాట్‌ యేతర కమ్యూనిటీ, దళితుల ఓట్లను కూడగట్టుకోవడంలో బీజేపీ విజయం సాధించింది.

ఈ కుల సమీకరణలే కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాయి. జాట్ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పెద్దపీట వేసింది. జాట్, దళిత్, మైనార్టీ ఓట్లపై ఎక్కువగా ఆశలు పెట్టుంది. హర్యానాలో 24 శాతం జాట్ సామాజిక వర్గమే ఉంటుంది. అయితే ఐఎన్‌ఎల్‌డీ జాట్ ఓట్లను చీల్చడంతో కాంగ్రెస్‌కు దెబ్బపడింది. జాట్ కమ్యూనిటీ బీజేపీపై ఆగ్రహంగా ఉండటంతో నాన్ జాట్, నాన్‌ మైనార్టీ ఓట్లను తనవైపు తిప్పుకోవడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. తూర్పు, దక్షిణ హర్యానా లాంటి నాన్‌ - జాట్ ఏరియాల్లో తన బలాన్ని నిలుపుకుంది. కాంగ్రెస్ 28 స్థానాల్లో జాట్లకు టిక్కెట్ ఇవ్వగా.. బీజేపీ జాట్‌ కమ్యూనిటీ నుంచి 16 మందిని బరిలోకి దింపింది. 

పనిచేయని రైతు చట్టాలు, రెజ్లర్ల నిరసనల అంశాలు

మూడు రైతు చట్టాల అంశం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ చట్టాలను కేేంద్రం వెనక్కి తీసుకున్న తర్వాత పంజాబ్‌లో బీజేపీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీని ప్రభావం హర్యానాపై కూడా ఉంటుందని భావించారు. కానీ అది జరగలేదు. అలాగే రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ నేత బ్రిజ్ బిషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు కూడా దుమారం రేపాయి. అయితే ఈ రెండు అంశాలు తమకు అనుకూలంగా మారుతాయని కాంగ్రెస్ విశ్వాసం వ్యక్తం చేసింది. కానీ ఇవి కాంగ్రెస్‌కు ఫలితాలను ఇవ్వలేకపోయాయి. అలాగే పారిస్ ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన వినేష్ ఫొగాట్ కాంగ్రెస్‌లో చేరారు. ఆమెను జులనా నియోజకవర్గం నుంచి హస్తం పార్టీ బరిలోకి దింపింది. వినేశ్ ఫొగాట్‌ గెలిచినప్పటికీ రెజ్లర్ల అంశం ప్రభావం అక్కడ కనిపించలేదు.  

Also Read: వినేశ్ ఉడుం 'పట్టు' దెబ్బకు బీజేపీ అభ్యర్థి అడ్రెస్‌ గల్లంతు!

అప్రమత్తమైన బీజేపీ

అలాగే ఈ ఏడాది మార్చిలో హర్యానా రాజకీయ పరిస్థితులుపై అప్రమత్తమైన బీజేపీ మనోహర్ లాల్ ఖట్టర్‌ను తొలగించి నాయబ్ సింగ్ సైనీకి ముఖ్యమంత్రి పదవి అప్పగించింది. అలాగే మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంది. హర్యానాలో 18-20 స్థానాల్లో ఓబీసీ ఓటర్లు ప్రభావం ఉంటుందని నమ్ముతారు. ఓబీసీ నేత సైనీతో పాటు బీజేపీ 24 మంది ఓబీసీ అభ్యర్థులను బరిలోకి దింపింది. కాంగ్రెస్ కూడా 20 మంది వెనకబడిన వర్గాల నేతలకు టిక్కెట్లు ఇచ్చినాకూడా కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బే తగిలింది.

దళితులు, ఓబీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు చేశారు. 2014కు ముందు హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని.. అప్పుడు దళితులు, ఓబీసీలపై అణిచివేత ఘటనలు అనేకసార్లు చోటుచేసుకున్నాయని వివరణ ఇచ్చారు. అంతేకాదు రిజర్వేషన్లను వ్యతిరేకించడం కాంగ్రెస్ డీఎన్‌ఏలో ఉందని కూడా మోదీ విమర్శించారు. ఈ అన్ని అంశాలు కూడా కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారడం వల్లే బీజేపీ అనూహ్యంగా మరోసారి అధికారాన్ని చేజిక్కుంచుకుంది. 

#telugu-news #congress #national-news #bjp #haryana assembly election 2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe