/rtv/media/media_files/2026/02/06/rbi-2026-02-06-21-43-44.jpg)
డిజిటల్ చెల్లింపుల యుగంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారత రిజర్వ్ బ్యాంక్ ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్, సైబర్ మోసాల వార్తలు ఎక్కువగా చూస్తున్నాము. అయితే ఆన్లైన్ ఫ్రాడ్కు గురై డబ్బులు పోగొట్టుకున్న వారికి ఆర్బీఐ గుడ్న్యూస్ చెప్పింది. ఆన్లైన్ మోసాల్లో డబ్బులు కోల్పోయిన బాధితులకు రూ.25,000 వరకు పరిహారం అందించే సరికొత్త ఫ్రేమ్వర్క్ను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ప్రకటించారు.
ఆర్బీఐ సరికొత్త మార్గదర్శకాలు
చిన్న మొత్తాల డిజిటల్ లావాదేవీల్లో మోసాలు జరిగినప్పుడు, సామాన్య వినియోగదారులు ఆర్థికంగా కుంగిపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు గరిష్టంగా రూ.25,000 లేదా మొత్తం నష్టపోయిన మొత్తంలో 85% (ఏది తక్కువైతే అది) పరిహారంగా అందుతుంది. కేవలం మొదటిసారి మోసపోయిన వారికి, అది కూడా చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ విషయంలో ఇది వర్తిస్తుంది. ఈ పరిహారం కోసం ఆర్బీఐ తన వద్ద ఉన్న 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ ఫండ్' నుండి నిధులను కేటాయించనుంది. నష్టపోయిన మొత్తంలో 70% ఆర్బీఐ భరిస్తుండగా, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు (15%) మరియు కస్టమర్ (15%) పంచుకోవాల్సి ఉంటుంది.
వినియోగదారుల రక్షణే లక్ష్యం
ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల్లో సుమారు 65% కేసులు రూ. 55,000 లోపు నష్టపోయినవే ఉన్నాయని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఓటీపీ (OTP) షేర్ చేసిన సందర్భాల్లో కూడా, మొదటిసారి మోసపోయిన వినియోగదారులకు ఈ పరిహారం అందేలా నిబంధనలను ఈజీ చేయడం విశేషం. కేవలం పరిహారమే కాకుండా, డిజిటల్ పేమెంట్లను మరింత సురక్షితం చేయడానికి ఆర్బీఐ మరికొన్ని ప్రతిపాదనలు చేసింది.
ల్యాగ్డ్ క్రెడిట్స్: పెద్ద మొత్తంలో లేదా కొత్త వ్యక్తులకు నగదు పంపేటప్పుడు కొద్దిసేపు నిలిపివేసి, ఆ తర్వాతే క్రెడిట్ అయ్యేలా చూడటం.
వృద్ధులకు ప్రత్యేక రక్షణ: సీనియర్ సిటిజన్లు మోసపోకుండా అదనపు అథెంటికేషన్ పొరలను ఏర్పాటు చేయడం.
రికవరీ ఏజెంట్ల ప్రవర్తన: అప్పుల వసూలు కోసం రికవరీ ఏజెంట్లు కస్టమర్లను వేధించకుండా కఠినమైన నిబంధనలు తీసుకురావడం.
Follow Us