అంతా సర్వనాశనం అయిపోయింది..అక్రమవలదారులుగా వచ్చిన భారతీయుల ఆవేదన

అక్రమవలసల తరలింపులో భాగంగా..మొదటి విడతలో 104 మంది భారతీయులను మొదట పంపించారు. ఇండియాకు చేరుకున్న వారంతా తమ కలలన్నీ సర్వనాశనం అయిపోయాయని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏజెంట్ల చేతుల్లో లక్షల రూపాయలు పోగొట్టుకున్నామని నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. 

New Update
indians from us

indians from us Photograph: (indians from us )

అక్రమవలసదారులను పట్టుకుని అమెరికా నుంచి సీ-17  గ్లోబ్ మాస్టర్ అమృత్ సర్ చేరుకుంది. ఇందులో 104 మంది భారతీయులు డిపోర్ట్ అయ్యారు. వలసదారుల్లో 33  మంది గుజరాత్, 33 మంది హర్యానావాసులు ఉండగా..  30 మంది పంజాబ్‌కు చెందినవారు ఉన్నారు.  వీరి తర్వాత ముగ్గురు మహారాష్ట్ర, ఇద్దరేసి ఛండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్‌లకు చెందినవారు కూడా ఉన్నారు. ఇందులో 25 మహిళలు, 12 మంది చిన్నారులు వీరిలో ఉండగా.. నాలుగేళ్లు బాలుడు ఒకరు ఉన్నాడు. వచ్చినవారిలో 48 మంది 25 ఏళ్లలోపువారే. ఇండియన్స్ ను తీసుకువచ్చిన విమానంలో  11 మంది క్రూ సిబ్బంది, 45 మంది అమెరికా అధికారులు కూడా ఉన్నారు.

ఏజెంట్ల చేతిలో మోసపోయాము..

అమెరికా నుంచి సంకెళ్ళతో ఇండియాలో అడుగుపెట్టారు భారతీయులు. మెక్సికో బోర్డర్ లో పట్టుకున్న తమను చిత్రహింసలకు గురి చేశారని..కాళ్ళకు సంకెళ్ళు వేసి తీసుకువచ్చారని వారు చెబుతున్నారు. అమృత్ సర్ ఎయిర్ పోర్ట్ లో దిగిన తర్వాతనే వాటిని తొలగించారని చెబుతున్నారు. తామంతా అమెరికా డ్రీమ్ కోసం ఏజెంట్ల చేతుల్లో మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టామని కన్నీరు మున్నీరయ్యారు. 

అక్రమ మార్గాల్లో..

పంజాబ్ కు చెందిన 36 ఏళ్ళ జస్పాల్ తాను ఏజెంట్ కు రూ.33 లక్షలు ఇచ్చానని చెప్పుకొచ్చారు. తనను చట్టపరంగా అమెరికా తీసుకెళతానని చెప్పి మోసం చేశాడని చెప్పారు. గత ఏడాది జూలైలో ఇండియా నుంచి బ్రెజిల్ చేరుకున్న తనకు అమెరికా కూడా విమానంలోనే పంపిస్తానని ట్రావెల్ ఏజెంట్ చెప్పాడు. కానీ ఆరు నెలలు బ్రెజిల్ లోనే గడిపిన తర్వాత అక్రమంగా అమెరికా సరిహద్దులు దాటించారు. అమెరికా సరిహద్దుల్లో బోర్డర్ పెట్రోలింగ్ పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని జస్పాల్ తెలిపాడు. కొన్ని రోజుల పాటూ అ్కడే నిర్భంధించారని..భారత్ కు పంపుతున్న విషయం కూడా తెలియదని చెప్పారు. అమెరికా బహిష్కరణతో తాను కుంగిపోయానని చెప్పుకొచ్చారు. 

మరొక వ్యక్తి హర్వీందర్ సింగ్ ది కూడా ఇలాంటి కథే. అమెరికా వీసా ఇప్పిస్తానని రూ.42 లక్షలు తీసుకున్నాడు ఏజెంట్. చివరి నిమిషంలో వీసా రాలేదని ఢిల్లీ మీదుగా ఖతార్.. ఆ తరువాత బ్రెజిల్ తీసుకువెళ్ళారు. బ్రెజిల్‌కు వెళ్లిన తర్వాత పెరూ నుంచి విమానం ఎక్కిస్తానని చెప్పారు. కానీ అది కూడా జరగలేదు. అక్కడ నుంచి టాక్సీలో తనతో పాటూ మరి కొంతమందిని కొలంబియాకు, పనామా కాలువకు కొంత దూరం వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఓడలో మమ్మల్ని పంపుతామన్నారు. కానీ ఆ ఓడ కూడా లేదు. ఆ తరువాత రెండు రోజుల పాటు డాంకీ రూట్ ద్వారా తీసుకెళ్ళారు. కొండల్లో రెండు రోజుల పాటు ప్రయాణించిన తర్వాత ఓ చిన్న పడవలో మెక్సికో సరిహద్దుల మీదుగా సముద్రం గుండా పంపారు. ఆ బోటు మునిగిపోయి నా వెంట ఉన్న ఒకరు చనిపోగా.. పనామా అడవుల్లో ఇంకొకరు ప్రాణాలు కోల్పోయాడని హర్వీందర్ చెప్పారు. మా దగ్గర ఉన్న అతికొద్ది ఆహారంతోనే అన్ని రోజులు నెట్టుకొచ్చాం అని తెలిపాడు. 

అమెరికా నుంచి బంధించి తీసుకువచ్చిన వారిలో అందరిదీ ఇంచుమించుగా ఇదే కథ. ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారే. 

Also Read: UGC: ఏపీలో మూడు, తెలంగాణలో ఒకటి..మొత్తం 18 కాలేజీలకు యూజీసీ నోటీసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు