Encounter:  అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో ఎన్ కౌంటర్..ముగ్గురు మావోలు మృతి

ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గరు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్‌ కమిటీ సభ్యురాలు అరుణ తో పాటు మరో మావోయిస్టు హతమయ్యారు.

New Update
3 Maoists Killed in maredumilli

3 Maoists Killed in maredumilli

Encounter:  ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి  అడవుల్లో బుధవారం తెల్లవారు జామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో  ముగ్గరు మావోయిస్టులు మృతిచెందారు. దీంతో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు ఉదయ్ , జోనల్‌ కమిటీ సభ్యురాలు అరుణ తో పాటు మరో మావోయిస్టు హతమైనట్లు సమాచారం. కాగా మరికొంతమంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌ ఘటనాస్థలి నుంచి  పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. అడవుల్లో మరి కొంతమంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో మారేడుమిల్లి అడవుల్లో గ్రేహౌండ్స్‌ బలగాల కూంబింగ్‌ కొనసాగుతోంది. కాగా ఉదయ్ పై రూ. 25 లక్షల రివార్డు ఉంది. ఉదయ్ అలియాస్‌ గాజర్ల రవి అలీయాస్ గణేష్‌ అలియాస్‌ బిరుసుది తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం. సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా, ఏవోబీ స్పెషల్ జోనల్ మెంబర్‌గా కొనసాగుతున్నారు.


 
ఇక జోనల్‌ కమిటీ సభ్యురాలిగా ఉన్న అరుణ మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య. ఆమెపై రూ. 20 లక్షల రివార్డు ఉంది. వెంకట రవి లక్ష్మి చైతన్య, అలియాస్ అరుణ అలియాస్ రూపీ..అరుణది విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరక వాణి పాలెం. అరుణ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్, ఏవోబీ సభ్యురాలిగా ఉన్నారు. అమె తమ్ముడు ఆజాద్‌  కొన్నేళ్ల క్రితం పాల సముద్రం ఎన్‌కౌంటర్‌ కాల్పుల్లో మృతి చెందారు.ఈమె తల్లి మావి నేత గతంలో మృతి చెందారు.మావో సీసీ మెంబర్ చలపతి ఈమె భర్త చంద్రబాబు అలిపిరి ఘటనలో కీలక వ్యక్తి.....తరవాత శ్రీకాకుళం దగ్గరలో కాల్పుల్లో మృతి చెందారు. విశాఖ జిల్లా మాజీ ఎమ్మెల్యే కోలారీ సర్వేశ్వర రావు...తో పాటు మరో ఎమ్మెల్యే హత్యలో అరుణ పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా మారెడుమిల్లి అటవీ ప్రాంతంలోని కొయ్యలగూడెం సమీపంలో మావోయిస్టు అగ్ర నేతలు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అల్లూరి జిల్లా పోలీసులు, గ్రేహౌండ్స్ సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి నుంచి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు.ఇవాళ ఉదయం వారికి మావోయిస్టులు ఎదురుపడగా.. ఇరువర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. కాగా ఘటన స్థలంలో  మూడు AK-47 రైఫిళ్లతో పాటు భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. కాగా AK-47 రైఫిళ్లు లభించడంతో మరికొంతమంది మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నారనే ప్రచారం సాగుతోంది. భద్రతాదళాలు వారికోసం జల్లడ పడుతున్నాయి.
 
కాగా మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు ఉదయ్‌ ఎన్‌కౌంటర్‌తో పార్టీకి భారీ నష్టం వాటిల్లింది. 21 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావం సమయంలో 42 మంది సెంట్రల్‌ కమిటీ సభ్యులు ఉండేవారు. ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో సభ్యుల సంఖ్య ఘననీయంగా తగ్గింది. ఈ ఏడాదే ఎన్‌కౌంటర్లలో నలుగురు సెంట్రల్‌ కమిటీ సభ్యులు మృతి చెందారు. మిగిలిన 16 మందిలో 11 మంది తెలుగువారే కావడం గమనార్హం. కాగా పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా మృతి చెందడంతో  కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపికపై ఆటు పార్టీ కసరత్తు చేస్తుండగా, ఎవరినీ నియమిస్తారనే దానిపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.
 

Advertisment
Advertisment
తాజా కథనాలు