/rtv/media/media_files/2025/12/13/sir-2025-12-13-18-11-50.jpg)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా భారత ఎన్నికల సంఘం భారీగా ఓటర్ల పేర్లు తొలగించింది. ఇటీవల నిర్వహించిన SIR ప్రక్రియ తర్వాత మంగళవారం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఏకంగా 42 లక్షల మంది పేర్లను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం మూడు రాష్ట్రాల్లో కలిపి 91 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించింది. మధ్యప్రదేశ్లో 2003 తర్వాత మళ్ళీ ఇంత భారీ స్థాయిలో ఈ ప్రక్రియను నిర్వహించడం విశేషం. ఈ రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ తొలగింపులు ప్రధానంగా నాలుగు కారణాల వల్ల జరిగాయి. సుమారు 8.40 లక్షల మంది ఓటర్లు మరణించినట్లు గ్రౌండ్ లెవల్ విచారణలో తేలింది.
మధ్యప్రదేశ్: అత్యధికంగా 42 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించారు. రాజధాని భోపాల్, ఇండోర్ వంటి నగరాల్లోనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.
ఛత్తీస్గఢ్: ఇక్కడ సుమారు 27 లక్షల మంది పేర్లను అధికారులు తొలగించారు. ప్రధానంగా వలసలు మరియు మరణించిన వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేరళ: కేరళలో సుమారు 22 లక్షల మంది (ముసాయిదా గణాంకాల ప్రకారం సుమారు 25 లక్షల వరకు ఉండవచ్చు) పేర్లు జాబితాలో లేవు.
మధ్యప్రదేశ్ లో అత్యధికంగా 22.50 లక్షల మంది ఓటర్లు తాము గతంలో నివసించిన అడ్రస్ నుండి ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లినట్లు గుర్తించారు. అలాగే సుమారు 2.50 లక్షల మంది పేర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైనట్లు గుర్తించి వాటిని తొలగించారు. రివిజన్ టైంలో 8.40 లక్షల మంది ఓటర్లు తమ నివాసాల్లో అందుబాటులో లేరని, మిగిలిన 28 వేల మంది ఇతర సాంకేతిక కారణాల వల్ల జాబితా నుండి తొలగించబడ్డారు.
ఈ ఓటర్ల తొలగింపు ప్రభావం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. రాజధాని భోపాల్లో మొత్తం 21.25 లక్షల ఓటర్లలో దాదాపు 4.3 లక్షల మంది (20.23%) పేర్లు తొలగించబడ్డాయి. ఇండోర్లో ఇక్కడ 4.4 లక్షల మంది (15.34%) ఓటర్లు జాబితా నుండి తప్పుకున్నారు. గ్వాలియర్, జబల్పూర్ నగరాల్లో 2.5 లక్షలు, 2.4 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 8, 2026 వరకు ఓటర్లు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు లేదా కొత్తగా పేరు నమోదు కోసం ఫారమ్-6 సమర్పించవచ్చు. అన్ని అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఫిబ్రవరి 2026లో తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.
Follow Us