/rtv/media/media_files/2024/11/19/flikAm5BYLbJYpGMKBE2.webp)
Air India Flight
Air India Flight: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికులకు వరుసగా షాక్ల మీద షాక్లు ఇస్తోంది. ఇప్పటికే పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తగా మిలాన్ నుంచి న్యూఢిల్లీ రావాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందంటూ చివరి నిమిషంలో వెల్లడించింది. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు.
Also Read : K Ramp Collections: 'కె-ర్యాంప్' కలెక్షన్స్..! అప్పుడే బ్రేక్ ఇవెన్ అయిపోయిందా..?
సమస్య నేపథ్యంలో సిబ్బంది విమానాన్ని వెనక్కి మళ్లించి.. సురక్షితంగా బయలుదేరిన ఎయిర్ పోర్టులోనే ల్యాండ్ చేశారు. కాగా ఈ విమానం మంగళవారం అర్థరాత్రి 1.15 గంటలకు ముంబై ఎయిర్ పోర్టు నుంచి ఏఐ 191 విమానం అమెరికా న్యూజెర్సీలోని నెవార్క్ నగరానికి ప్రయాణికులతో బయలుదేరింది. అయితే బయలు దేరిన కొన్ని గంటల తర్వాత విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ముంబై ఏటీసీకి సమాచారం అందించారు. స్పందించిన ఎయిర్ పోర్ట్ అధికారుల సూచన మేరకు సదరు ఎయిర్ ఇండియా విమానాన్ని ఈ తెల్లవారు జామున 5.30 గంటలకు ముంబై ఎయిర్పోర్టులో సురక్షితంగా దించారు.
విమానం ల్యాండ్ కాగానే విమానంలో ఏర్పడిన సమస్యను గుర్తించేందుకు సాంకేతిక బృందం రంగంలోకి దిగింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులు సమస్యను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అయితే ప్రస్తుత విమాన ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. అంత వరకు ఆ ప్రయాణీకులకు ముంబైలో వసతి సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఎయిర్ ఇండియా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా వేడుకలను తమ వారితో జరుపుకోవాలని ఇటలీ మిలాన్లోని భారతీయులు భావించారు. దానికోసం భారత్ వెళ్లేందుకు అక్టోబర్ 17న ఎయిర్ ఇండియా విమానాన్ని వారు బుక్ చేసుకున్నారు. స్వదేశానికి వెళ్లాలని అంతా సిద్ధం చేసుకున్నాక ఈ విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడిందని చివరి నిమిషంలో ఎయిర్ఇండియా ప్రకటించింది. దీంతో ఈ విమాన సర్వీసును రద్దు చేసినట్లు సంస్థ ప్రకటించింది. అది కూడా చివరి నిమిషంలో చెప్పడంతో ఎయిర్ ఇండియా సంస్థపై ఆ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ నెల ఆరంభంలోనూ వియన్నా నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో కూడా సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఈ విమానాన్ని దుబాయ్కు మళ్లించిన విషయం తెలిసిందే. పలుమార్లు తనిఖీల అనంతరం ఈ విమాన సర్వీస్ భారత్కు వచ్చింది.
Follow Us