/rtv/media/media_files/2025/06/21/israel-and-iran-2025-06-21-09-32-30.jpg)
ఇజ్రాయిల్, ఇరాన్ పరస్పర దాడులు 8వ రోజుకు చేరుకున్నాయి. ఇరు దేశాలు దాడుల తీవ్రతను మరింత పెంచాయి. అటు ఇజ్రాయెలూ తగ్గడం లేదు. ఇటు ఇరానూ వెనుకడుగు వేయడం లేదు. సై అంటే సై అంటున్నాయి. ఒకవైపు యుద్ధం ఆపడానికి జెనీవాలో చర్చల ప్రక్రియ ప్రారంభమైనా.. రెండు దేశాలు బాంబుల వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాయి. టెల్ అవీవ్, హైఫా, బీర్షిబా నగరాలపై బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. హైఫా నగరంపై ఇరాన్ చేసిన మిసైల్ దాడిలో 23 మందికి గాయాలయ్యాయి. పశ్చిమ ఇరాన్లోని కెర్మన్షా, తబ్రీజ్ ప్రాంతాలలో ఉన్న బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాలపైనా 25 యుద్ధ విమానాలతో దాడులు చేసింది. కాస్పియన్ సముద్రం సమీపంలో ఉన్న రాస్త్ నగరంపైనా బాంబులు వేసింది. ఇజ్రాయెల్ 60కిపైగా ఇరాన్ ఫైటర్ జెట్స్ను గాల్లోనే పేల్చి వేసింది.
ఇరాన్పై దాడి చేయాలా లేదా అనే విషయంపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం పేర్కొన్న నేపథ్యంలో ఐరోపా నేతలతో సమావేశం అవ్వడానికి ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ శుక్రవారం జెనీవా చేరుకున్నారు. అక్కడ అనేక గంటలపాటు ఐరోపా, ఇరాన్ నేతల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్ని మరింతగా కొనసాగించాలని ఐరోపా నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.