Pakistan visit: ఇరాన్‌ న్యూక్లియర్ ప్రొగ్రామ్‌కు పాకిస్తాన్ సపోర్ట్

ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పాకిస్తాన్‌లో పర్యటించడం అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేకాదు ఇరాన్ న్యూక్లియర్ ప్రొగామ్‌కు పాకిస్తాన్ బహిరంగంగా మద్దతు తెలిపింది.

New Update
Iranian President Masoud Pezizkian visits Pakistan

ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పాకిస్తాన్‌లో పర్యటించడం అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేకాదు ఇరాన్ న్యూక్లియర్ ప్రొగామ్‌కు పాకిస్తాన్ బహిరంగంగా మద్దతు తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పర్యటనలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, ప్రాంతీయ భద్రతతో పాటు ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు జరిగాయి.

అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో భేటీ అనంతరం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇరాన్‌కు శాంతియుత అవసరాల కోసం అణు సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునే హక్కు ఉందని ఆయన బహిరంగంగా ప్రకటించారు. ఈ ప్రకటన ఇజ్రాయెల్, అమెరికాల నుండి ఇరాన్‌పై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్న సమయంలో రావడం గమనార్హం. ఇజ్రాయెల్ చేసిన దాడులను ఖండించిన షెహబాజ్ షరీఫ్, ఆత్మరక్షణ కోసం ప్రతీకారం తీర్చుకునే హక్కు ఇరాన్‌కు ఉందని కూడా స్పష్టం చేశారు.

గతంలో ఇరాన్ తనపై ఇజ్రాయెల్ అణుదాడి చేస్తే, పాకిస్తాన్ కూడా అణుదాడి చేస్తుందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్ జనరల్ మొహ్సెన్ రెజాయ్ ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. అయితే, ఈ ప్రకటనను పాకిస్తాన్ ఖండించింది. మూడవ పార్టీ ఘర్షణలతో తమ అణ్వాయుధాలకు ఎలాంటి సంబంధం లేదని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఇజ్రాయెల్ దూకుడును ఎదుర్కొనేందుకు ముస్లిం దేశాలు ఐక్యంగా ఉండాలని పాకిస్తాన్ పదేపదే పిలుపునిచ్చింది.

ప్రస్తుతం పాకిస్తాన్‌లో జరుగుతున్న ఈ సమావేశాలు ఇరాన్‌కు సైనికపరంగా కాకుండా, రాజకీయంగా మద్దతును కూడగట్టుకోవడానికి ఒక వేదికగా మారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య 10 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం లక్ష్యంగా ఈ పర్యటన జరగగా, దీని వెనుక అణు కార్యక్రమంపై ఇరాన్ భద్రతను బలోపేతం చేసుకోవాలనే వ్యూహం కూడా దాగి ఉందని తెలుస్తోంది. పెజెష్కియాన్ పర్యటనతో ఇరాన్, పాకిస్తాన్ మధ్య ఉన్న స్నేహబంధం మరింత బలపడింది. అయితే, ఈ పరిణామాలు పశ్చిమాసియా ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని భౌగోళిక రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు