/rtv/media/media_files/2025/10/11/big-shock-for-mohsin-naqvi-icc-director-post-removed-2025-10-11-08-37-21.jpg)
Big shock for Mohsin Naqvi...ICC director post removed?
Mohsin Naqvi : భారత్, పాకిస్తాన్ మధ్య ఉండే ఉద్రిక్తతలు క్రికెట్ మైదానంలోనూ కనిపిస్తుంటాయి. ఈ విషయంలో అప్పుడప్పుడు పరిమితులు దాటి వివాదాలకు కూడా దారి తీస్తుంటాయి. తాజాగా, భారత్ గెలిచిన ఆసియా కప్ ట్రోఫీ చుట్టూ పెద్ద వివాదం చోటుచేసుకొంది. భారత జట్టు విజయం సాధించినా, వారికి ఇంత వరకు ఆసియా కప్ ట్రోఫీ అందలేదు. ఈ ఖండాతర టోర్నీ చరిత్రలో అత్యంత వివాదాస్పద ఎడిషన్గా నిలిచింది. రెండు జట్ల మధ్య షేక్ హ్యాండ్ తో మొదలైన వివాదం ఆసియా కప్ ట్రోఫీ వరకూ ఆధ్యంతం తీవ్ర ఉత్కంఠతో సాగింది. పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో భారత జట్టు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించిన విషయం తెలిసిందే.
అంతేకాదు ఆ తర్వాత ఏసీసీ చైర్మెన్, పీసీబీ చీఫ్ మోహ్సన్ నఖ్వీ(mohsin naqvi) చేతుల మీదుగా విన్నింగ్ ట్రోఫీని అందుకోవడానికి భారత జట్టు సముఖత చూపలేదు. అయితే నక్వీ తన చేతుల మీదుగానే ట్రోఫీ తీసుకోవాలని పట్టుబట్టినా బీసీసీఐ ఆదేశాల మేరకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ అందుకు అంగీకరించలేదు. దీంతో నఖ్వీ స్టేడియం నుంచి ట్రోఫీతో పాటు విజేతల పతకాలను కూడా తీసుకెళ్లి పోయాడు ఇది పెద్ద వివాదానికి దారితీసింది. నేటికి ఇంకా ట్రోఫీని భారత్కు అతడు అందజేయకపోవడం గమనార్హం. ట్రోఫీ ప్రస్తుతం దుబాయ్లోని ఏసీసీ ఆఫీస్లోనే ఉంది. తన అనుమతి లేకుండా ట్రోఫీని ఎవరికీ ఇవ్వకూడదని ఏసీసీ అధికారులకు నఖ్వీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
అయితే భారత్ విజయం సాధించినప్పటికీ నఖ్వీ ట్రోఫీని తీసుకుని వెళ్లిపోవడం, ఇంకా అందజేయకపోవడంపై బీసీసీఐ సీరియస్గా ఉంది. వచ్చే నెలలో జరిగే ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని బీసీసీఐ లేవనెత్తడానికి సిద్ధమైంది. అంతేకాకుండా ఐసీసీ డైరెక్టర్ గా ఉన్న నఖ్వీని ఆ పదవి నుండి తొలిగించాలని భారత క్రికెట్ బోర్డు ఐసీసీని డిమాండ్ చేస్తోంది. కాగా ఐసీసీ చైర్మెన్గా జై షా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో నఖ్వీ డైరక్టర్ పదవి ఊడిపోవడం ఖాయమని ప్రచారం సాగుతోంది."ఆసియాకప్ టోర్నీకి అధికారిక హోస్ట్గా ఉన్న బీసీసీఐకి ట్రోఫీని పంపడానికి నిరాకరించే హక్కు నఖ్వీకి లేదు. అతడు ట్రోఫీని భారత్కు ఇప్పటికే పంపించాల్సింది. కానీ అందుకు అతడు ఒప్పుకోవడం లేదు. కాబట్టి అందుకు నఖ్వీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు" అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
‘ఆసియా కప్ ట్రోఫీ ఇప్పటికీ దుబాయ్లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉంది. తన ఆదేశం లేకుండా ట్రోఫీని ఎక్కడికీ తీసుకెళ్లరాదని, ఎవ్వరికీ ఇవ్వరాదని ఆయన స్పష్టమైన ఆదేశాలిచ్చారు. బీసీసీఐకి గానీ భారత జట్టు నుంచి గానీ ఎవరైనా వస్తే తన చేతుల మీదుగానే ట్రోఫీని అందజేస్తానని ఆయన ఆదేశించారు’ అని ఏసీసీ ప్రతినిధి ఒకరు చెప్పారు. దీంతో ఈ వివాదం ఐసీసీకి చేరే అవకాశం ఉంది. ఈ సమస్యను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లాలని బీసీసీఐ నిర్ణయించింది. రాబోయే ఐసీసీ సమావేశంలో ఈ అంశాన్ని అధికారికంగా లేవనెత్తాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, త్వరలోనే మోహ్సిన్ నఖ్వీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తప్పించే అవకాశం కూడా ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read : బిగ్ బాస్ దిమ్మతిరిగే ట్విస్ట్..! పాపం తనూజ.. నెక్స్ట్ కెప్టెన్ అతడే!