Doordarshan : కాషాయ రంగులోకి మారిన దూరదర్శన్ లోగో.. బీజేపీపై తీవ్ర విమర్శలు..

ప్రభుత్వ ప్రసార సంస్థ దూరదర్శన్ న్యూస్‌ ఛానల్ లోగో మారింది. గతంలో ఈ లోగో ఎరుపు రంగులో ఉండగా.. తాజాగా దీన్ని కాషాయ రంగులోకి మార్చేశారు. అయితే దీన్ని బీజేపీ జెండా రంగులోకి మార్చడంతో విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

New Update
Doordarshan : కాషాయ రంగులోకి మారిన దూరదర్శన్ లోగో.. బీజేపీపై తీవ్ర విమర్శలు..

TV Channel : ప్రభుత్వ ప్రసార సంస్థ అయిన దూరదర్శన్ ఛానల్ గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. ఒకప్పుడు వార్తలు చూడాలన్నా.. సినిమాలు చూడాలన్నా ఈ ఒక్క ఛానల్ మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉండేది. దీని తర్వాతే అనేక ఛానళ్లు వచ్చాయి. అయితే తాజాగా దూరదర్శన్‌ ఛానల్‌(Doordarshan Channel) వివాదంలో చిక్కుకుంది. దీనికి కారణం డీడీ న్యూస్ లోగో రంగు మారడమే. గతంలో ఈ లోగో ఎరుపు రంగులో ఉండేది. ఇప్పుడు దాన్ని కాషాయ రంగులోకి మార్చేశారు. మా విలువలు ఎప్పటిలాగే ఉన్నాయి. ఇక నుంచి మేము కొత్త అవతార్‌లో అందుబాటులో ఉంటా. కొత్త ప్రయాణానికి రెడీ అవ్వండి అంటూ ఆ సంస్థ సోషల్ మీడియా(Social Media) లో పేర్కొంది.

Also Read : కేంద్రమంత్రికి కారు లేదంట..ఎన్నికల అఫిడవిట్‌లో అమిత్‌ షా ఆస్తుల వివరాలు

డీడీ న్యూస్ లోగోను బీజేపీ(BJP) జెండా రంగులోకి మార్చడంతో.. దీనిపై విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలపై నియంత్రణ సాధించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శిస్తున్నాయి. జాతీయ ప్రసార సంస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దూరదర్శన్ లోగో రంగు మారడంతో.. దాని మాతృక సంస్థ ప్రసారభారతి (డీడీ, ఆల్ ఇండియా రేడియో) మాజీ సీఈవో జవహర్ సిర్కార్ కూడా ఈ మార్పును తప్పుబట్టారు. ఈ నిర్ణయం వల్ల ఇకనుంచి ఇది ప్రసార భారతీ కాదు.. ప్రచార భారతి అనే భావన కలుగుతోంది అంటూ విమర్శలు చేశారు. మరోవైపు డీడీ న్యూస్(DD News) రంగు మార్చడంపై ప్రసారభారతి ప్రస్తుత సీఈవో గౌరవ్ ద్వివేది స్పందించారు. దృశ్య సౌందర్యాన్ని మరింత పెంచేందుకే రంగును మార్చామని.. దీనిపై విమర్శలు దురదృష్టకరమని అన్నారు.

ఇదిలాఉండగా.. 1959 సెప్టెంబర్ 15న మొదటిసారి దూరదర్శన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత దీన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ శాఖ కిందకు తీసుకొచ్చారు. దీంతో ఈ ఛానల్ జాతీయ బ్రాడ్‌కాస్టర్‌గా మారింది. ఆ తర్వాత డీడీ నెట్‌వర్క్ కింద అనేక ఛానళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం దూరదర్శన్‌లో ఆరు జాతీయ, 17 ప్రాంతీయ ఛానళ్లు ఉన్నాయి. అయితే గతంలో కూడా కొన్నిసార్లు ఈ ఛానళ్ల లోగో రంగులను మార్చారు. ఎరుపు, పసుపు, నీలం ఇలా కొన్ని రంగుల్లో కనిపించాయి. ఇప్పుడు తాజాగా డీడీ న్యూస్ కాషాయ రంగులోకి మారడం రాజకీయ వివాదంగా మారింది.

Also Read:  ఇప్పుడు రావడం లేదు.. భారత్‌లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా

Advertisment
Advertisment
తాజా కథనాలు