Bhatti Vikramarka : రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఛాలెంజ్‌గా తీసుకున్నా: భట్టి విక్రమార్క

తెలంగాణలో డిప్యూటీ సీఎంగా, ఆర్థికశాఖగా బాధ్యతలు చేపట్టిన భట్టి విక్రమార్క ఆర్థికశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయం, వ్యయం, అప్పుల గురించి భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కే రామకృష్ణారావు వివరించారు.

New Update
Bhatti Vikramarka : రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఛాలెంజ్‌గా తీసుకున్నా: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Challenge : తెలంగాణ(Telangana) లో డిప్యూటీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా భట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు (శనివారం) జరిగిన శాసన సభ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ సమావేశాలు ఈ నెల 14కు వాయిదా పడ్డాయి. ఇవి పునఃప్రారంభమైన తొలిరోజున అసెంబ్లీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. అయితే ఈరోజు ఆర్థికశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. శాసనసభ వాయిదా పడిన తర్వాత సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎంకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అధికారులు స్వాగతం పలికారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాలు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయం, వ్యయం, రాష్ట్ర అప్పుల గురించి భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కే రామకృష్ణారావు వివరించారు. 2014 జూన్ 2 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ఆదాయం, వ్యయం కలిగిన ప్రయోజనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో భట్టి తీర్మానించారు. వీటికి సంబంధించి పలు అంశాలను చర్చించారు.

ఈ సమావేశంలో మంత్రి భట్టి విక్రమార్క చెప్పిన ముఖ్యాంశాలు

1. సంపద సృష్టించడం సృష్టించిన సంపద ప్రజలకు పంచడం కోసం ఆర్థిక శాఖ అధికారులు ఆదాయ వనరుల అన్వేషణ కోసం తమ మేధస్సును ఉపయోగించాలి

2. ప్రభుత్వ విజయం ఆర్థిక శాఖ పైన ఆధారపడి ఉంటుంది

3. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, అభయ హస్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చడానికి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అధికారులు మనస్ఫూర్తిగా పనిచేయాలి.

4. ఉద్యోగస్థుల్లా కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నామన్న కమిట్మెంట్‎తో మనస్ఫూర్తిగా విధులు నిర్వర్తించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయి. ప్రభుత్వ విజయానికి దోహదపడిన వారు అవుతారు.

5. తెలంగాణ రాష్ట్రం ఐదున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నది. అయినప్పటికీ ఛాలెంజ్‌గా ఈ శాఖకు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను.

6. అనేక సవాళ్ళను అధిగమిస్తూ రాష్ట్ర ఆర్థిక పురోగతిని మనందరం కలిసికట్టుగా సాధిద్దాం.

7. రాష్ట్రంలో తన పాదయాత్ర చేసిన సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు చెప్పుకున్న బాధలు విన్న తర్వాత తెచ్చుకున్న తెలంగాణకు అర్థం లేదని భావించి వారి సమస్యలను పరిష్కరించడానికి ఆరు గ్యారెంటీలు అభయహస్తం మేనిఫెస్టోలో హామీలను ప్రకటించాం.

8.ఇండ్లు లేక కొందరు, కొలువులు లేక నిరుద్యోగులు, ఉన్నత చదువులు చదివించలేక విద్యార్థుల తల్లిదండ్రులు, ఉన్నత చదువులు చదివిన కొలువులు రాకపోవడంతో పెళ్లిళ్లలో క్యాటరింగ్ సప్లయర్స్ గా వెళ్లి పనిచేస్తున్న యువత దుస్థితిని పాదయాత్రలో చూశాను.

9. ఉచితాలు ప్రజలకు ప్రభుత్వాలు ఫ్రీగా ఇవ్వడం లేదు. హ్యూమన్ రిసోర్స్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నామని భావించాలి

10. హ్యూమన్ రిసోర్స్‎ను బలోపేతం చేసుకోవడం వల్ల జీడీపీ పెరుగుతుంది

11. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేశాం

12. మహిళా సాధికారతకు తొలి అడుగుగా మహాలక్ష్మి పథకం ప్రారంభించి అందులో భాగంగా రాష్ట్రంలోని మహిళలందరికీ తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించాము.

13. ఆరోగ్య తెలంగాణగా ఈ రాష్ట్రం ఉండాలని ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి నేటి నుంచి అమలు చేస్తున్నాం

14. మిగతా గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చడానికి ఆదాయ వనరులను సమకూర్చుకునే దిశగా అధికార యంత్రాంగం పనిచేయాలని దశ దిశ నిర్దేశం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, సెక్రటరీ టి కె. శ్రీదేవి, జాయింట్ సెక్రటరీలు కృష్ణ భాస్కర్, కే హరిత, అడిషనల్ సెక్రటరీ ఆర్ రవి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : శాసనసభలో రేవంత్, భట్టి ఆలింగనం

Advertisment
తాజా కథనాలు