AP:ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. జగన్, చంద్రబాబులకు షర్మిలా లేఖ

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం జగన్, చంద్రబాబులకు లేఖ రాశారు. పదేళ్లలో రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందంటూ ప్రత్యేక హోదా సహా విభజన హామీలను ఇందులో ప్రస్తావించారు. ప్రజల హక్కుల తీర్మానాన్ని వెంటనే ఆమోదించి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని కోరారు.

AP:ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. జగన్, చంద్రబాబులకు షర్మిలా లేఖ
New Update

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు (AP PCC Chief) షర్మిలా (Sharmila).. సీఎం జగన్, టీడీపీ నాయకుడు చంద్రబాబులకు లేఖ రాశారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కుగా ఆమె ఇందులో పేర్కొన్నారు. బీజేపీ 10ఏళ్లుగా చేసిన ద్రోహం అసెంబ్లీ వేదికగా చర్చించాలని డిమాండ్ చేశారు. అలాగే హామీలన్నింటినీ వెంటనే అమలు చేసేందుకు అసెంబ్లీలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానాన్ని వెంటనే ఆమోదించి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని కోరారు.\

పదేళ్లలో అన్యాయం..
'నేను.. వైఎస్ షర్మి. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఈ లేఖ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లలో జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలులో జాప్యాన్ని మరొక్కసారి మీ జ్ఞప్తికి తీసుకువద్దామనుకుంటున్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని, ఈ ఆంధ్ర రాష్ట్రాల హక్కుల తీర్మానం కోసం అన్ని పార్టీలు కలిసికట్టుగా డిమాండ్ చెయ్యాలని కోరుకుంటున్నాం.

దురదృష్టకరం..
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం గడిచిన పదేళ్లలో అటు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో మొదటి ఐదేండ్లు టీడీపీ, ఇప్పుడు వైసీపీ పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నా పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరం, అత్యంత బాధాకరం.

హమీలు పక్కనపెట్టేసింది..
నాడు తెలంగాణ ఏర్పాటులో భాగంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరగకుండా అభివృద్ధి, పునర్నిర్మాణం అత్యంత వేగంగా జరగాలనే ఉద్దేశ్యంతో, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం- 2014 లో ప్రత్యేక హోదా సహా పోలవరానికి జాతీయ హోదా వంటి ముఖ్యమైన హామీలు పొందుపరచటం జరిగింది. కానీ విభజన అనంతరం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ ఆ హామీలను పూర్తిగా పక్కనపెట్టేసింది. నాడు బీజేపీతో పొత్తులో ఉన్న మీ పార్టీ.. ఐదున్నర కోట్ల ప్రజల ఆశలను, ఆశయాలను తీర్చే హామీలను సాధించుకోవడానికి పోరాటం చేయలేదు. ఏపీ ప్రజలకు ఆనాడు మీరు చేసిన అన్యాయానికి మేము చింతిస్తున్నాము. రాష్ట్రానికి జరిగిన చారిత్రిక అన్యాయాన్ని సరిచేస్తామనే వాగ్దానంతో 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు.

బీజేపీతో పొత్తులో ఉండి..
2014లో అధికారంలోకి వచ్చాక కేంద్రంలోని బీజేపీతో పొత్తులో ఉండి కూడా ప్రత్యేక హోదా సాధించలేకపోయింది రాష్ట్రం. అటు పోలవరం పునరావాసంతో కలిపి వ్యయం భరిస్తూ కేంద్రం కట్టాలని చట్టంలో ఉన్నా నేటికీ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు కదలట్లేదు. అయినా విభజన హామీలపై టీడీపీ నిలదీసే ప్రయత్నం చేయడం లేదు. హోదా కావాలని ఒకసారి, హోదా అవసరం లేదని మరోసారి మాట మారుస్తూ ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆశలపై నీళ్లు చల్లిన మీరు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. విభజన జరిగి పదేళ్లయినా ఇప్పటికీ ఐదున్నర కోట్ల మంది ఆంధ్రులు నైరాశ్యంలో ఉండి ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు ఏంటని అల్లాడిపోతున్నారు. తమ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే విభజన హామీల అమలు కోసం ఎదరు చూస్తున్నారని వాపోయారు.

ఇది కూడా చదవండి : kottagudem: ఇల్లందు మున్సిపాలిటీలో చల్లారని అవిశ్వాస సెగ.. కౌన్సిలర్ ఆస్తులపై దాడులు

నిర్లక్ష్యానికి గురవుతున్నా..
ఆనాడు సిరి సంపదలు, సంక్షేమం, అభివృద్ధితో పాటు దేశానికే అన్నపూర్ణగా ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం, నేడు అన్నిరంగాల్లో నిర్లక్ష్యానికి గురవుతున్న విషయాన్ని మీరు గమనిస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా అన్నిటికీ సంజీవని అని చెప్పిన మీ పార్టీ.. మళ్లీ మాతో కలిసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పోరు ఉధృతం చెయ్యాలని మేము కోరుకుంటున్నామని తెలిపారు.

ప్రజల గొంతుకగా..
ఈ సందర్భంగా మరొక్కసారి ప్రజల గొంతుకగా, వారి ఆశలకు దర్పణంగా, నిబద్దతతో విభజన హామీలపై కలిసి పోరాడదామని కాంగ్రెస్ పార్టీ మీకు విజ్ఞప్తి చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై, రాజకీయాలకు అతీతంగా, రాష్ట్రంకోసం నిలబడి, కలబడాలని పిలుపునిస్తున్నాము. అలాగే, అఖిల పక్షాన్ని తీసుకువెళ్లి ఢిల్లీలో మన రాష్ట్ర గళం విప్పాలని ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని, ఒత్తిడి తీసుకురావాలని, దీనికోసం మీరు మాతో కలిసిరావాలని విజ్ఞప్తి చేస్తున్నము. దీనికి మీరు చొరవ చూపితే, కాంగ్రెస్ అన్నివిధాలుగా సహకరిస్తుందని, రాష్ట్ర భవిష్యత్తు తరవాతే మాకు ఏదైనా అని తెలియజేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు.

అమలు కాని విభజన హామీలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో నాటి ప్రధాని చేసిన ప్రకటనకు అనుగుణంగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేక హోదా తీర్మానాన్ని రాష్ట్ర సర్కారు ఆమోదించేలా చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలి. దీని ద్వారా విభజన హామీల అమలు కోసం కేంద్రంపై రాష్ట్ర సర్కారు ఒత్తిడి పెంచేలా మనం డిమాండ్ చేయాలి.

- పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా
- విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్
- రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనకబడిన ప్రాంతాలకు నిధులు
- కడపలో ఉక్కు ఫ్యాక్టరీ
- విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్
- కొత్త రాజధాని నగర నిర్మాణం

ఇవి కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం మనకు ఉంది. మా విన్నపాలను, డిమాండ్ లను రాష్ట్ర అభివృద్ధి, ఐదున్నర కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, రాజకీయాలకు అతీతంగా మీరు వెంటనే సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు.

#ap #letter #chendrababu #cm-jagan #ys-sharmila
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి