ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి నేతలతో సమావేశం అయ్యారు. సింగరేణి ప్రాంతానికి చెందిన జాగృతి నేతలు ఈ రోజు బంజారాహిల్స్లోని కవిత నివాసానికి భారీగా తరలివచ్చారు. వారితో సమావేశమై కవిత పలు అంశాలపై చర్చిస్తున్నారు. తాజా రాజకీయపరిణామాలపై వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో పరిణామాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తండ్రి కేసీఆర్ కు కవిత లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ప్రారంభమైన సింగరేణి ఏరియా జాగృతి శ్రేణుల సమావేశం.@RaoKavitha #telangana #brs #kavitha #meeting #singareni #RTV pic.twitter.com/zPqMSZFm03
— RTV (@RTVnewsnetwork) May 27, 2025
నిన్న కేసీఆర్ తరఫున ఎంపీ దివికొండ దామోదర్ రావుతో పాటు గండ్ర మోహన్ రావు కవితతో చర్చలు జరిపారు. కేసీఆర్ కూడా కవితతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పార్టీలో తన పాత్రపై క్లారిటీ ఇవ్వాలని కవిత డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. లేకుంటే తనదారి తాను చూసుకుంటానని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీ ఏర్పాటుకు కవిత రెడీ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
కేటీఆర్ కు నోటీసులు.. ఖండించిన కవిత..
ఇదిలా ఉంటే.. ఫార్ములా ఈ రేసు కేసులో నిన్న కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కవిత స్పందించారు. ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిందని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టం అవుతోందన్నారు. తమ పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైందన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ గారి సైనికులదని ట్వీట్ చేశారు కవిత.
(kalvakuntla-kavitha | kcr | telugu-news | telugu breaking news)