/rtv/media/media_files/2025/02/21/HBcmMl1lh0NbPz52AIWR.jpg)
Revanth Reddy Vs KCR Vs Kishan Reddy
పన్నెండేళ్ల మోదీ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై, పన్నెండు నెలల తమ పాలనపై చర్చకు తాము సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎవరొస్తారో రండి.. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ వచ్చినా లేదా ఆయన కొడుకు, అల్లుడిని ఎవరిని పంపించినా పర్వాలేదన్నారు. ప్లేస్, డేట్ చెప్పండి.. చర్చకు నేను సిద్ధం అంటూ సంచలన సవాల్ విసిరారు. నారాయణపేటలో ఈ రోజు జరిగిన ప్రజా పాలన-ప్రగతి బాట బహిరంగ సభలో రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ నువ్వు గట్టిగా కొట్టాలంటే నీ కొడుకును, నీ బిడ్డను, నీ అల్లుడిని కొట్టుకో అని ఎద్దేవా చేశారు. కానీ కాంగ్రెస్ ను కొడతామంటే తమ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తానంటే నిన్ను ఎవరైనా వద్దన్నారా? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. పన్నెండు నెలల్లో మేం ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారన్నారు.
తాము అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువకులకు 55 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మహిళలకు అమ్మ ఆదర్శ పాఠశాలలు అప్పగించి వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆర్టీసీలో మహిళకు 600 బస్సులను అప్పగించి వారిని ఓనర్లను చేశామన్నారు. రూ.5వేల కోట్లతో కొడంగల్, వెయ్యి కోట్లతో నారాయణపేటలో అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ఏడాదికి 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. ఏ గ్రామాల్లో తాము ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామో అక్కడ తాము పోటీ చేస్తామని.. ఎక్కడ మీరు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారో అక్కడే పోటీచేయాలని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు.
నీకు ఏం అన్యాయం చేసినం కేసీఆర్ మేము..
— RTV (@RTVnewsnetwork) February 21, 2025
నీ వల్లే చంద్రబాబు నాయుడు తో నాకు గొడవ అయింది..
సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు @revanth_anumula @KCRBRSPresident #Telangana #RTV pic.twitter.com/OJFyGP1609
దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ కులగణన నిర్వహించామన్నారు. 30 ఏళ్లుగా పరిష్కారం కాని ఎస్సీ ఉపకులాల సమస్యకు పరిష్కారం చూపామన్నారు. ఇవన్నీ కేసీఆర్ కళ్లకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. నల్ల డబ్బు పేదల ఖాతాలో వేస్తామన్న మోదీ ఏం చేశారు? అని ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తానని వారిని మోసం చేశారన్నారు. 2022 లోగా ప్రతీ పేదవాడికి ఇళ్లు ఇస్తామన్నారు.. ఎక్కడ ఇచ్చారో చెప్పాలని బీజేపీ నేతలను ప్రశ్నించారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి తప్పా తెలంగాణలో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేసినా తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్డ కాకుల్లా పొడుస్తున్నారని ఫైర్ అయ్యారు. కాకుల్లా పొడిచే వీళ్లకు సరైన జవాబు చెప్పే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదేనన్నారు. పాలమూరు పచ్చగా కనబడితే వాళ్ల కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
పాలమూరును పడావు పెట్టింది కేసీఆర్ కాదా?
పదేళ్లుగా పాలమూరు జిల్లాకు ఎందుకు నీళ్లు రాలేదని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేయలేదదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పడావుపెట్టి కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లాను ఎడారిగా మార్చాడని ధ్వజమెత్తారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు అనుమతి తెస్తే తనపై కోపంతో దాన్ని పడావు పెట్టాడన్నారు. ఆనాడు వైఎస్ కు ఊడిగం చేసి కృష్ణా జలాలు సీమకు తరలించుకుపోయేందుకు సహకరించింది నువ్వు కాదా కేసీఆర్? అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి రాయలసీమకు నీళ్లు తరలించుకు పోతుంటే చూస్తూ ఊరుకుంది నువ్వు కాదా? అంటూ ధ్వజమెత్తారు. నీళ్లు రాయలసీమ తరలించుకుపోతే.. నిధులు కేసీఆర్ కుటుంబం తరలించుకుపోయిందన్నారు.