/rtv/media/media_files/2026/02/15/boggula-srinivas-2026-02-15-19-05-54.jpg)
Boggula Srinivas
Boggula Srinivas : " పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో' పుస్తకంతో పాపులరైన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లోకి ఆయన ప్రయాణిస్తున్న కారు దూసుకెళ్లిన ఘటనలో శ్రీనివాస్ దుర్మరణం పాలయ్యారు. అయితే శనివారం ఉదయం 7–30 సమయంలో కారు నీళ్లలో కొంతమేర మునిగినట్లు తెలుస్తోంది. అయితే వెనుక సీటులో కూర్చున్న శ్రీనివాస్ మృతి చెందడం.. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పరారవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతుడు శ్రీనివాస్ కర్నూలు జిల్లా అల్లూరు గ్రామానికి చెందినవాడు.ఆయన సాహిత్య పరిశోధకుడిగా, యూట్యూబర్గానూ గుర్తింపు పొందారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివిన ఆయన పలు పుస్తకాలు రచించగా.. 2014లో పవన్కళ్యాణ్ రాజకీయ రంగప్రవేశంపై ‘పవన్కళ్యాణ్ హటావో.. పాలిటిక్స్ బచావో’ పేరిట రాసిన పుస్తకం సంచలనం సృష్టించింది. ఈ పుస్తకం 8 లక్షలకుపైగా కాపీలు అమ్ముడు పోయింది. అయితే ఆ సమయంలో పవన్కళ్యాణ్ అభిమానుల నుంచి ఆయనకు బెదిరింపులు రావడంతో తెలంగాణ ప్రభుత్వం ఆయనకు రక్షణ కూడా కల్పించింది. ఆయన మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎలా గుర్తించారంటే?
శ్రీనివాస్ మృతి చెందిన విషయం మొదట మత్స్యకారులు గుర్తించారు. ఆయన ప్రయాణిస్తున్న ఏపీ 16 డీపీ 2345 నంబరు కారు పాలేరులోకి దూసుకెళ్లింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు కారును గుర్తించి స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్పందించన స్థానికులు ట్రాక్టర్ సాయంతో కారును ఒడ్డుకు లాగారు. వెనుక సీటులో కూర్చున్న శ్రీనివాస్ మృతి చెంది ఉన్నాడు. అయితే, కారు నీటిలో పడిన సమయంలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి నాయకన్గూడెం వైపు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
హత్యనా? ప్రమాదామా?
కారులో ఇద్దరు ప్రయాణిస్తుండగా, కారు నీళ్లల్లో పడిన వెంటనే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కారులో నుంచి ఒడ్డుకు వచ్చి వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వెనుకాల సీటులో కూర్చున్న వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేయకపోవడం అనుమానం రేకెత్తిస్తోంది. మరోపక్క మృతుడి నుదురు, ముఖంపై గాయాలు ఉండటంతో నీటిలో పడిన సమయంలో తగిలాయా, ఎక్కడైనా హత్య చేసి కారులో తీసుకొచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీనివాస్ ది యాక్సిడెంట్ కాదు..మర్డర్ : కుటుంబ సభ్యులు
రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతిలో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. శ్రీనివాస్ది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని కుటంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై వారు పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు.శ్రీనివాస్ ఒంటిపై బలమైన గాయాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు అంటున్నారు.తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలేరు ట్యాంక్బండ్పైకి కొత్త దారి ఉన్నప్పటికీ పాత రోడ్డులోకి శ్రీనివాస్ కారు ఎందుకు వెళ్లింది అనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు.శ్రీనివాస్ డ్రైవర్ ఎందుకు పరార్ అయ్యాడనేది తెలియని పరిస్థితి. కారు ఓనర్ అయిన శ్రీనివాస్ స్నేహితుడు కూడా అజ్ఞాతంలోకి వెళ్లడం మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. కారు డ్రైవర్ ఎవరు అనేది తెలియని పరిస్థితి నెలకొంది. డ్రైవర్ ఆచూకి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
Follow Us