/rtv/media/media_files/2026/01/26/amaravathii-2026-01-26-20-59-19.jpg)
RTC driver suffers heart attack
Telangana : ఇటీవల డ్రైవింగ్ సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడం సంచలనంగా మారింది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద అత్యంత విషాదకరమైన ఘటన జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు బస్సు నడుపుతున్న సమయంలోనే గుండెపోటు వచ్చింది. అయితే ఆయన చూపిన సమయస్ఫూర్తి వల్ల 19 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ దురదృష్టవశాత్తు డ్రైవర్ మాత్రం మృత్యువాత పడటం అందరినీ కలచివేచింది.హైదరాబాద్(మియాపూర్) నుంచి విజయవాడ వెళ్తున్న అమరావతి బస్సు నడుపుతుండగా డ్రైవర్ నాగరాజుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.
ఆయనకు తన సమస్య అర్థమైంది. తను చావు అంచుల్లో ఉండి కూడా ప్రయాణికుల క్షేమం కోసం ఆయన తాపత్రయపడ్డారు. వెంటనే బస్సును అదుపుచేసి సర్వీస్ రోడ్డులో నిలిపివేశారు. ఆ వెంటనే ఆయన స్టీరింగ్ మీద ఒరిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే నాగరాజు బస్సు ఆపిన వెంటనే సిబ్బంది, స్థానికులు ఆయనను ఆటోలో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఈసీజీ(ECG) తీసిన వైద్యులు.. అప్పటికే ఆయన మరణించినట్లు తేల్చి చెప్పారు. ఒకవేళ మొదటి ఆస్పత్రిలోనే ఆయనకు చికిత్స అంది ఉంటే ఆయన బతికి ఉండేవారేమో అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నాగరాజుది గొల్లపూడి(విజయవాడ). ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుస్తోంది.
అయితే ఇటీవల కాలంలో ఇలాంటి మరణాలు సర్వసాధారణమై పోయాయి. అయితే ఇలాంటి సమయంలో ప్రాథమిక అవగాహనతో వారి ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్యులు పేర్కొన్నారు. ఛాతీలో విపరీతమైన నొప్పి, ఎడమ చేయి లేదా దవడ వైపు నొప్పి పాకడం, అకస్మాత్తుగా చెమటలు పట్టడం లాంటివి కనిపిస్తే.. వాహనాన్ని వెంటనే సురక్షిత ప్రాంతంలో ఆపి, ఇంజిన్ ఆఫ్ చేయాలన్నారు. సమీపంలో ఉన్నవారికి సమాచారం అందించి సీపీఆర్ లేదా అత్యవసర వైద్యం కోసం ప్రయత్నించాలని అలా చేస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.
Follow Us