సైబర్ నేరాలు భారీగా పెరిగిపోయాయి. ఎప్పటికప్పుడు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. పోలీసుల ఆలోచనలకు ధీటుగా స్కెచ్ లు వేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, ఓటిపి, డిజిటల్ అరెస్టుల పేరుతో బాధితులను నిట్టనిలువునా ముంచుతున్నారు. పోలీసులు ఎంత హెచ్చరించినా జనాల్లో మాత్రం ఈ విషయంలో మార్పు రావడం లేదు. రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కమీషన్ల ఆశ చూపి యువతను సైబర్ మోసాల ఉచ్చులోకి లాగుతున్నారు కొందరు కేటుగాళ్లు. తాజాగా సూర్యపేట జిల్లాలోని కోదాడ పరిసర ప్రాంతాల్లోని చాలామంది యువతీయువకులు సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు. దాదాపుగా 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీసీఎస్ భవన్లో సైబర్ క్రైమ్ డీసీపీ దార కవిత వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇద్దరి అరెస్టుతో ఈ విషయం వెలుగులోకి రావడం విశేషం. కోదాడ దగ్గరలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు హైదరాబాద్లో బీటెక్ అగ్రికల్చర్ చదువుతున్నాడు. ఓ రోజు అతనికి అతడి తండ్రి ఫోన్ చేసి అర్జెంట్గా ఇంటికి రావాలని పిలిపించాడు. వచ్చాక ఊర్లో జరుగుతున్న విషయాన్ని కొడుక్కి చెప్పాడు. ఊర్లో కుర్రాళ్లంతా ట్రేడింగ్ చేస్తూ రోజుకు వేలల్లో సంపాదిస్తున్నట్లుగా తెలిపాడు. అప్పటికే అతని తండ్రి ట్రేడింగ్ నేర్చుకుంటున్నాడు. ఇక కొడుకుతో పాటుగా ఇతర యువకులు కొందరు కొన్ని ట్రేడింగ్ యాప్లను డౌన్లోడ్ చేసి ట్రేడింగ్లో పాల్గొనడం, అందులో నిర్వాహకులకు బ్యాంకు అకౌంట్స్ అందించడం, ఇతరులతో పెట్టుబడులు పెట్టించి ఆ డబ్బును యూఎస్ డీలుగా కన్వర్ట్ చేసి పంపడం చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ యువతి హైదరాబాద్ నుంచి వచ్చేసి ట్రేడింగ్ చేస్తూ పెట్టుబడులు పెట్టించడం, బ్యాంకు అకౌంట్స్ సమకూర్చడం చేస్తోంది. ఇలా ఒక్కొక్కరు కాస్త వందలుగా తయారయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు అయితే ఓ ట్రేడింగ్ మోసం కేసును చేధించే క్రమంలో పోలీసులకు ఈ గ్రామానికి చెందిన ఇద్దరు ఓ యువతి, మరో యువకుడికి సంబంధముందని తేలడంతో విచారణ ప్రారంభించారు. విచారణలో పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి. ఇందులో ఒకరు కాదు ఇద్దరు కాదు ఆ ఊరిలోని వారంతా ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టించారని గుర్తించారు. పెట్టించడంతో పాటు.. బ్యాంకు ఖాతాలు సమకూర్చడం, సైబర్ మోసగాళ్లకు సహకరిస్తూ.. పెట్టుబడి పెట్టిన డబ్బును యూఎస్ డీలుగా మార్చడం వంటి నేరాలకు పాల్పడుతున్నట్లుగా విచారణలో కనుగొన్నారు. దీంతో అందరికీ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే.. ఉత్తరప్రదేశ్లో స్వ చ్ఛంద సంస్థను నడుపుతూ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కమలేశ్కుమారి కూడా ఇందులో పాలు పంచుకున్నారు. ఈమె స్వచ్ఛంద ఖాతాను వాడుకున్న సైబర్ నేరగాళ్లు భారీగా కమీషన్ ఇచ్చారని వెల్లడైంది. అరస్టైయిన వారిలో విదేశాలలో ఉన్న కీలక సూత్రధారులకు భారత్ నుంచి సహకరిస్తున్నవాళ్లూ ఉన్నారని తెలిపారు. ఈ దర్యాప్తుతో అలెర్ట్ అయిన సైబర్ క్రైమ్ అధికారులు మరింత ఫోకస్ పెడుతున్నట్లుగా వెల్లడించారు. Also Read : జడేజాకు బిస్కెట్.. నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్!