ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు టీమిండియా జట్టు ప్రకటన మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి జనవరి12లోపు అనౌన్స్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. అయితే ఐసీసీని గడువు పొడిగించాలని అభ్యర్థించనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం జనవరి 18 లేదా 19న జట్టు ప్రకటన ఉంటుందని సమాచారం. ఇంగ్లండ్తో జరగనున్న టీ20, వన్డేలకు కూడా జట్లను ప్రకటించలేదు బీసీసీఐ. అయితే మరో రెండ్రోజుల్లో టీ20 జట్టును ప్రకటిస్తారని క్రీడావర్గాలు చెబుతున్నాయి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా జట్టు ఇంగ్లండ్తో తలపడనుంది. మొత్తం ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే ఇంగ్లండ్తో జరగబోయే వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని కేఎల్ రాహుల్ బీసీసీఐని కోరగా.. ముందుగా అంగీకరించినప్పటికీ.. ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఆడాలని సూచించింది బీసీసీఐ. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటనపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆటగాళ్లలో కూడా తీవ్ర పోటీ నెలకొంది. బ్యాటింగ్ ఆర్డర్, స్పిన్ అటాక్, డెత్ బౌలింగ్ వంటి అన్ని రంగాలలో ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేయడం ఇప్పుడు సెలెక్టర్లకు సవాలుతో కూడుకుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో సహా భారత టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లకు ఛాంపియన్ ట్రోఫీలో మిడిల్ ఆర్డర్ లో ఆడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటిన తెలుగు కుర్రాడు, ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి ఛాంపియన్ ట్రోఫీలో ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రవీంద్ర జడేజా స్థానంపై మాత్రం సందిగ్థం నెలకొంది. జడేజాను తీసుకోవాలా యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలా అనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. జడేజాకు అక్షర్, దూబే, సుందర్ లాంటి ఆటగాళ్లతో పోటీ నెలకొంది. దుబాయ్ లాంటి స్పీన్ పిచ్ లపై ఆడినప్పుడు సీనియర్ ఆటగాళ్లు కీలకం అనుకుంటే జడేజాకు అవకాశం ఉంటుంది. కాగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. పాకిస్థాన్, దుబాయ్ వేదికల్లో ఈ ట్రోఫీ జరగనుంది. Also Read : Sankranti కి ఇంటికెళ్తే.. ఈ రూట్ బెటర్.. ఈజీగా వెళ్లిపోవచ్చు!