/rtv/media/media_files/2025/06/14/ssKwLlhRWdxV3WaNSdgf.jpg)
Danam vs Vijaya Reddy
Danam Nagender VS Vijaya Reddy : ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమావేశం బంజారా హిల్స్ లేక్ వ్యూలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభనుంచి వెళ్లిపోయారు.
అయితే దానం నాగేందర్,విజయా రెడ్డిల మధ్య విబేధాలు ఇప్పటివి కావు. పీజేఆర్ మరణానంతరం ఖైరతాబాద్ నియోజవర్గాన్ని విభజించగా బంజారాహిల్స్ నుంచి ఆమె సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేస్తూ వస్తున్నారు. అయితే ఖైరతాబాద్ నియోజవర్గంలో పీజేఆర్కు ఉన్న ఆదరణతో ఆయన కూతురు ఖైరతాబాద్ టికెట్ ఆశిస్తూ వస్తున్నారు. అయితే ఆమె ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆమెకు మాత్రం ఎమ్మెల్యే టికెట్ దక్కటంలేదు. తను పోటీ చేయాలనుకున్న ప్రతిసారి దానం అడ్డుతగులుతున్నాడని ఆమె వర్గం ఆరోపిస్తోంది.
ప్రత్యేక రాష్ర్టం ఏర్పడక ముందు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అయితే వైఎస్ మరణం తర్వాత ఆమె జగన్ పార్టీలో చేరారు. ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పోటీచేశారు. కానీ ఓడిపోయారు. రాష్ర్టం ఏర్పడిన తర్వాత విజయారెడ్డి బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్గా గెలుపొందారు. ఆ తర్వాత దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్లో చేరారు. అయితే బీఆర్ఎస్ టికెట్ ఆశించి ఆమె పార్టీలో చేరితే దానంకు టికెట్ ఇవ్వడంతో విజయారెడ్డి అసంతృప్తికి లోనయ్యారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో దానం నాగేందర్ విజయారెడ్డి ఇంటికి వెళ్లి రాజీ కుదుర్చుకున్నారు. అయితే మరోసారి కార్పొరేటర్గా గెలిచిన విజయారెడ్డి జీహెచ్ఎంసీ మేయర్ సీటు ఆశించారు. కానీ దాన్ని కేశవరావు బిడ్డ విజయలక్ష్మి దక్కించుకున్నారు. దీంతో విజయారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో దానం రెండవసారి బీఆర్ఎస్ నుంచి గెలిచాడు. అయితే రాష్ట్రంలో అధికారం చేజారడంతో దానం కాంగ్రెస్ గూటికి చేరాడు. ఆయన చేరికను విజయారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ రేవంత్ రెడ్డి దానం ను చేర్చుకున్నారు. అప్పటి నుంచి మళ్లీ ఇద్దరి మధ్య మరోసారి విబేధాలు చోటు చేసుకున్నాయి. తను పార్టీ మారినా ప్రతిసారి దానం అదే పార్టీలోకి వస్తూ తనను రాజకీయంగా ఎదగకుండా అడ్డుపడుతున్నాడనే అసంతృప్తి విజయరెడ్డిలో చాలా కాలంగా ఉంది. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు తప్పడం లేదు.
కాంగ్రెస్లో చేరిన తర్వాత గతంలోనూ వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హిమాయత్నగర్లో జరిగిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్లెక్సీలో విజయారెడ్డి ఫోటో పెట్టకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా దానంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని విజయారెడ్డిని సముదాయించారు. అయితే ఈ రోజు మాత్రం ఇరువర్గాలు మరింత దూకుడుగా వ్యవహరించడంతో వర్గపోరు తారాస్థాయికి చేరుకుందన్న విమర్శలు వినవస్తున్నాయి.