/rtv/media/media_files/2026/01/09/fotojet-14-2026-01-09-19-58-53.jpg)
Goat Blood Mafia
Goat Blood Mafia : గత కొంతకాలంగా ఎలాంటి అనుమతి లేకుండా జీవించి ఉన్న జంతువుల నుంచి రక్తం సేకరిస్తున్న వ్యవహారంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఘట్కేసర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వాణి ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్థానికంగా ఉన్న సోను మటన్ అండ్ చికెన్ షాప్పై బీఎన్ఎస్ 223తో పాటు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ (పీసీఏఏ) కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
కాగా.. సోను మటన్ షాప్లో జీవించి ఉన్న మేక నుంచి రక్తం సేకరించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈనెల 4న నాగారంలోని సోను మటన్ షాపుపై కీసర పోలీసులు దాడులు చేయగా.. 130 ప్యాకెట్ల మేకల రక్తం లభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేకల నుంచి రక్తాన్ని సేకరిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ రక్తాన్ని కాచిగూడలోని సీఎన్కే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంస్థకు తరలించి.. అక్కడి నుంచి లేబొరేటరీల్లో ప్లేట్లెట్ల తయారీకి వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ‘గోట్ బ్లడ్ మాఫియా’ ఎలాంటి వైద్య ప్రమాణాలూ పాటించకుండా మేకలు, గొర్రెల నుంచి అక్రమంగా రక్తం సేకరించి, దాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు.
ఫ్రిజ్లో మేక రక్తం నిల్వలు
సోను మటన్ షాప్ నిర్వహాకుల సమాచారంతో కాచిగూడలోని సీఎన్కే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంస్థ ల్యాబ్ ను సీజ్ చేశారు. కాగా సీజ్చేసిన సీఎంకే ల్యాబ్నుంచి అక్కడి ప్రిజ్లలో నిల్వచేసిన వెయ్యి లీటర్ల జంతురక్తాన్ని డీసీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వైద్య, ప్రయోగాత్మక అవసరాల పేరుతో దీన్ని దుర్వినియోగం చేస్తున్నారనే అనుమానాలు అధికారులు వెల్లడించారు.
హరియాణాకు తరలింపు..
అయితే ఈ రక్తాన్ని హరియాణాకు చెందిన పాళీ మెడిక్యూర్ కంపెనీకి పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో జంతు రక్తాన్ని ఎందుకు సేకరించి తరలిస్తున్నారో ఇప్పటికీ దర్యాప్తులో తేలలేదు. కాచిగూడలో నిర్వహించిన దాడుల్లో ఆటోక్లేవ్ మెషిన్ లామినార్ ఏయిర్ ఫ్లోయూనిట్ ఉండడం ఆందోళన కలిగిస్తోందని డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒకరు తెలిపారు. లామినార్ ఏయిర్ ఫ్లో అనేది రక్తాన్ని ఒక బ్యాగ్నుంచి మరో బ్యాగుకు టెర్రరిల్ వాతావరణంలో మార్చడానికి వినియోగిస్తారు. ఇది ఉండటం వల్ల అక్కడ రక్తం ప్రాసెసింగ్ జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. బ్యాక్టీరియా పెంపకం కోసం ఉపయోగించే కల్చర్ మీడియా తయారీకి, చర్మ చికిత్సలు, జుట్టు ఉత్పత్తులు, టీకాల తయారీకి ఉపయోగించే సీరం వెలికితీతకు ఈ రక్తాన్ని వినియోగించి ఉండవచ్చని భావిస్తున్నారు. కేసులో ప్రధాన నిందితుడైన నికేష్ పరారీలో ఉన్నాడు. నికేష్ పట్టుబడితే రక్త సేకరణ విధానం, ఎక్కడ నుంచి ఎంత మొత్తంలో రక్తం తీసుకుంటున్నారన్న అంశాలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
కేంద్రం సీరియస్..
కాగా బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న ముఠాపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఈ వ్యవహారంపై కేంద్ర డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి దర్యాప్తు ప్రారంభమైంది.ముఖ్యంగా ఈ రక్తంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారా అనే అనుమానాన్ని డ్రగ్ కంట్రోల్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన అనుమతులు లేకుండా జంతు రక్తాన్ని సేకరించి తరలించడం చట్టవిరుద్ధమని వారు పేర్కొన్నారు. ప్రాథమిక విచారణలో కీసర ప్రాంతంలోని నిర్మానుష ప్రదేశాల్లో బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం లభించింది.
Follow Us