/rtv/media/media_files/2025/04/15/b7OuNUXexvUDFzhyRrxf.jpg)
Saraswati Pushkaralu
Saraswati Pushkaralu 2025 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో గురువారం నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే ఈ త్రివేణి సంగమంలో నేటి నుంచి ఈ నెల 26 వరకు ఈ పుష్కరాలు జరగనున్నాయి. బృహస్పతి (గురువు) మిథున రాశిలోకి ప్రవేశంతో సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయి. నిజానికి బుధవారం రాత్రి 10.35 నిమిషాలకే గురువు మిథునరాశిలోకి ప్రవేశించాడు. అయితే గురువారం సూర్యోదయం నుంచి పుష్కర స్నానాలు ఆచరిస్తారు.
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి పుష్కరాలు కావడంతో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో పుష్కారాలు ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవారు జామున 5.44 గంటలకు సరస్వతి ఘాట్ వద్ద శ్రీగురు మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు.ఇక ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు... కాళేశ్వరం చేరుకొని పుష్కర స్నానం ఆచరిస్తారు.సీఎం రేవంత్ రెడ్డి దంపతులు వస్తున్న నేపథ్యంలో అక్కడ పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.
నవరత్న మాల హారతి
కాగా 12 రోజుల పాటు జరిగే పుష్కరాలలో ప్రతిరోజూ సరస్వతి ఘాట్లో సాయంత్రం 6.45 నుంచి 7.35 గంటల వరకు సరస్వతి నవరత్న మాల హారతి ఉంటుంది. దీంతోపాటు తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజు కళా, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసింది. కాగా ప్రతిరోజు సగటున లక్షన్నర మంది వస్తారని దేవాదాయశాఖ అంచనా వేసింది. దానికి తగినట్లు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.
కాగా ఈ రోజు సాయంత్రం కాళేశ్వర స్నానం ఆచరించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దంపతులు శ్రీకాళేశ్వర, ముక్తీశ్వర స్వామి వార్లను దర్శించుకుంటారు. అనంతరం సరస్వతి నదికి ఇచ్చే ప్రత్యేక హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గోదావరి నది ఒడ్డున నూతనంగా ఏర్పాటు చేసిన 10 అడుగుల 10 అడుగుల సరస్వతిదేవి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంరతం భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని ప్రారంభిస్తారు.