/rtv/media/media_files/2026/02/15/fotojet-14-2026-02-15-20-32-04.jpg)
Big twist in Karimnagar Corporation.. Independents join Congress
Municipal Elections: మున్సిపల్ ఎన్నికలు ముగిసి మేయర్ ఎంపిక కోసం కసరత్తులు సాగుతున్న వేళ కరీంనగర్ కార్పొరేషన్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అక్కడ రాజకీయ సమీకరణలు గంట గంటకు మారుతున్నాయి. బీజేపీకి పూర్తి స్థాయి కార్పొరేటర్ల బలం ఉందని తమదే మేయర్ పీఠం అని బీజేపీ నేతలు సంతోషించే లోపే వారి ఆశలను ఆవిరి చేస్తూ పలువురు కార్పొరేటర్లు వారికి షాక్ ఇచ్చారు. నిన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన స్వతంత్ర కార్పొరేటర్లు బీజేపీకి హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ పావులు కదపడంతో కరీంనగర్కు చెందిన ఇద్దరు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్పొరేటర్లతో పాటు, ముగ్గురు స్వతంత్ర కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరడం గమనార్హం. వారంతా హైదరాబాద్లో శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ చేరడం సంచలనంగా మారింది.
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి విజయం సాధించిన సాయిజ్యోతి, శ్యామలతో పాటు స్వతంత్ర కార్పొరేటర్లు కొమరయ్య, నందిని ఉదయ్, మల్లేశం తదితరులు హస్తం గూటికి చేరారు. వీరంతా నిన్న బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరినవారే కావడం విశేషం. వీరితో పాటు ఎంఐఎంకు చెందిన ముగ్గురు కార్పొరేటర్లు, మరో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన మాజీద్ హుస్సేన్ కూడా మంత్రుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
కాగా కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్లు మాట్లాడుతూ.. కరీంనగర్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని బలంగా నమ్ముతున్నామని తెలిపారు. అభివృద్ధి కాంక్షించి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. అయితే 30 సీట్లు సాధించి కరీంనగర్ కార్పొరేషన్ లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ తమకే మేయర్ పీఠం దక్కుతుందని భావించింది. అయితే తాజా పరిణామాలతో కాంగ్రెస్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లు ఉండగా బీజేపీ 30, కాంగ్రెస్కు 14, బీఆర్ఎస్కు 9, ఎంఐఎంకు 3 దక్కాయి. 2 ఫార్వర్డ్ బ్లాక్ కు 8 మంది స్వతంత్రులు విజయం సాధించారు. ఇక్కడ మేయర్ పీఠాన్ని సాధించాలంటే 35 మంది సభ్యుల బలం కావాలి.
నిజానికి కాంగ్రెస్కు సంఖ్యాబలం లేకపోయినప్పటికీ ఇండిపెండెంట్లు, బీఆర్ఎస్తో పాటు ఎంఐఎం, ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్లతో కలిసి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే బీఆర్ఎస్ తమకు మేయర్ పీఠం కావాలని డిమాండ్ చేస్తుండటంతో రేపు మేయర్ ఎన్నిక సమయానికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.
Follow Us