BRS Party : బీఆర్‌ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఆ 7గురు ఎమ్మెల్యేలు జంప్?

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద, అరికెపూడి గాంధీ, మహిపాల్ రెడ్డి, సబితారెడ్డి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ రోజు బీఆర్ఎస్ నిర్వహించిన మీటింగ్ కు వీరు హాజరుకాకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

New Update
BRS Party : బీఆర్‌ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఆ 7గురు ఎమ్మెల్యేలు జంప్?

Telangana Politics : బీఆర్ఎస్ (BRS) పార్టీకి రోజుకో షాక్ తగులుతోంది. కాంగ్రెస్ (Congress) పార్టీ వ్యూహాలతో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నమ్మకమైన నేతలు కూడా షాక్ ఇస్తూ కాంగ్రెస్ గూటికి చేరుతుండడంతో ఏం చేయాలో అర్థం కాక నాయకత్వం తలలు పట్టుకుంటోంది. స్వయంగా కేసీఆర్ (KCR) రంగంలోకి దిగి పార్టీ భవిష్యత్ పై భరోసా కల్పిస్తున్నా.. జంపింగ్ లు ఆగడం లేదు. మొన్న ఎమ్మెల్యే కాలె యాదయ్య, నిన్న ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడం ఆ పార్టీని కలవర పెడుతోంది. తాజాగా హైదరాబాద్ సిటీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. కేటీఆర్ నిర్వహించిన కీలక సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో వారు కాంగ్రెస్ లో చేరడం ఖాయమన్న ప్రచారం మళ్లీ ప్రారంభమైంది. రేపే జీహెచ్ఎంసీ (GHMC) కౌన్సిల్ మీటింగ్ నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ (Talasani Srinivas) ఆధ్వర్యంలో ఈ రోజు కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏర్పాటు చేశారు.

అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా కౌన్సిల్ మీటింగ్ లో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించాలని భావించారు. కానీ ఈ మీటింగ్ కు ఏకంగా 7 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరై బీఆర్ఎస్ కు ఊహించని బిగ్ షాక్ ఇచ్చారు. మీటింగ్‌కు గైర్హాజరైన వారిలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

ఇందులో పటాన్ చెరు, ఉప్పల్, మల్కాజ్ గిరి ఎమ్మెల్యేలు మినహా మిగతా నలుగురు గతంలో వివిధ పార్టీల్లో గెలిచి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చేరిన వారే కావడం గమనార్హం. మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, కేవీ వివేకానంద 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయం సాధించి.. అనంతరం నాటి అధికార టీఆర్ఎస్ లో చేరారు. 2018, 2023లో వీరు అదే పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ముగ్గురికి టీడీపీలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన సబితారెడ్డి అనంతరం అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరి.. మంత్రి అయ్యారు. కాంగ్రెస్ లో హోం మంత్రిగా పని చేసిన సబితా రెడ్డికి ఆ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డికి సైతం వీరి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీరింతా పార్టీ మారడం ఖాయమన్న చర్చ జోరుగా సాగుతోంది.

Also Read : తెలంగాణలో ‘నిరుద్యోగుల మార్చ్‌’.. బర్రెలక్క అరెస్ట్!

Advertisment
తాజా కథనాలు