4th Test: రాహుల్, గిల్ గోడకట్టారు..డ్రా దిశగా టీమ్ ఇండియా పోరాటం

మాంచెస్టర్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమ్ ఇండియా ఏటికి ఎదురీదుతోంది. కెప్టెన్ శుభ్ మన్ గిల్, కేఎ ల్ రాహుల్ పట్టువదలకుండా ఆడుతూ గోడ కట్టారు. ఐదో రోజు కూడా ఇలానే కొనసాగితే మ్యాచ్ డ్రా చేయవచ్చును. 

New Update
gill

India Vs England 4th Test

నాలుగు టెస్ట్ లో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ అయ్యేసరికి 311 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా అసలేమీ పరుగులు చేయకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో ఓటమి ఖాయం అనుకున్నారు అందరూ. కానీ సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్ మన్ గిల్ లు పిల్లర్లలా నిలబడిపోయారు. ఓపిగ్గా ఆడుతూ, పరుగులు రాబడుతూ వికెట్ పడకుండా నాలుగో రోజు ఆటను ముగించారు. ఫలితంగా నాలుగో టెస్టులో డ్రా మీద ఆశలు చిగురించాయి. చివరి రోజు వీళ్లిద్దరూ ఇంకొన్ని గంటలు నిలిస్తే.. వీరి స్ఫూర్తితో మిగతా బ్యాటర్లూ పోరాడితే మాంచెస్టర్‌లో టీమ్‌ఇండియా డ్రాతో గట్టెక్కొచ్చు.

ఆశలు ఇంకా మిగిలే ఉన్నాయి..

ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌  210 బంతుల్లో 8×4 లతో 87 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అలాగే మరో ఎండ్ లో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌  167 బంతుల్లో 10×4 లతో 78 పరుగులు చేశాడు. ఇంకా బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సరికి భారత ఇన్నింగ్స్ 174/2తో ఉంది. ఇంకా ఒకరోజు ఆట మిగిలి ఉంది. రాహుల్, గిల్ జోడీ గొప్పగా పోరాడి జట్టును కాపాడింది. అయితే ఇంగ్లాండ్ తో సమం అవ్వాలంటే ఇంకా 137 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు 544/7తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్‌ 669 పరుగులకు ఆలౌటైంది. బెన్‌ స్టోక్స్‌  198 బంతుల్లో 11×4, 3×6లతో 141 పరుగులతో సెంచరీ పూర్తి చేశాడు. జడేజా 4 వికెట్లు తీశాడు.

Advertisment
తాజా కథనాలు