Dubai : 25 కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆఫ్ఘన్‌ రాయబారి!

దుబాయ్ నుంచి ముంబై మీదుగా భారత్ లోకి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఆఫ్షాన్ రాయబారిని ముంబై విమానాశ్రయంలో అధికారులు అదుపులో తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 25 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ సుమారు రూ. 18.6 కోట్ల వరకు ఉంటుంది.

New Update
Dubai : 25 కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆఫ్ఘన్‌ రాయబారి!

Gold Smuggling : సాధారణంగా ఎయిర్ పోర్టు(Air Port) ల్లో కొన్ని గ్రాముల్లోనే బంగారం తరలిస్తూ స్మగ్లర్లు(Smugglers) పట్టుబడుతుంటారు. ఆ కాస్త బంగారమే అధికారుల కంటబడకుండా దాచేందుకు నానా తంటాలు పడుతుంటారు. కానీ భారత్(India) లో ఆఫ్ఘనిస్థాన్‌ కాన్సుల్ జనరల్ గా పనిచేస్తున్న జకియా వార్దక్ (58) మాత్రం కళ్లు చెదిరే స్థాయిలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది. దుబాయ్ నుంచి ముంబైకి ఏకంగా రూ. 18.6 కోట్ల విలువైన 25 కేజీల బంగారాన్ని దర్జాగా తరలించబోయి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ (డీఆర్ఐ) అధికారులకు చిక్కింది. గత నెల 25న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై సోషల్ మీడియా(Social Media) లో దుమారం రేగడంతో జకియా తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

దౌత్య పాస్ పోర్టు ఉండటంతో..
ప్రపంచవ్యాప్తంగా రాయబారులకు ఆయా దేశాలు దౌత్య పాస్ పోర్టులు జారీ చేస్తాయి. ఈ పాస్ పోర్టులు ఉన్న వారికి అరెస్టుల నుంచి మినహాయింపు ఉంటుంది. దీంతో జకియా వార్దక్ దీన్ని అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ వేసింది. ఏప్రిల్ 25న కుమారుడితో కలసి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుంచి ముంబై చేరుకుంది. భారీ లగేజీతో గ్రీన్ చానల్ ద్వారా ఎయిర్ పోర్టు ఎగ్జిట్ పాయింట్ వద్దకు చేరుకుంది. అయితే ఆమె బంగారం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో డీఆర్ఐ అధికారులు వారిని ఆపారు. లగేజీలో బంగారం తరలిస్తున్నారా అని అడగ్గా లేదని బదులివ్వడంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాటిలో బంగారం లేకపోవడంతో ఆమెను మహిళా సిబ్బంది తనిఖీ గదిలోకి తీసుకెళ్లి చెక్ చేశారు. దీంతో ఆమె ధరించిన కస్టమైస్డ్ జాకెట్ లో దాచిన ఒక్కోటీ కేజీ బరువైన 25 బంగారం బార్ లు బయటపడ్డాయి. ఆ బంగారమంతా 24 క్యారెట్ల స్వచ్ఛతతో ఉన్నదని తేల్చారు. దీంతో బంగారం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. కానీ అరెస్టుల నుంచి దౌత్యపరమైన రక్షణ ఉండటంతో వారిద్దరినీ వదిలేశారు.

2021లో అప్పటి ఆఫ్ఘన్‌ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఆమెను భారత్ లో రాయబారిగా నియమించారు. తాలిబన్లు ఆఫ్ఘన్‌ ను తిరిగి ఆక్రమించి పాలన సాగిస్తున్నప్పటికీ భారత్ వారి పాలనను అధికారికంగా గుర్తించడంలేదు. అయితే భారత్ లో విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం వచ్చే తమ దేశ పౌరులకు ముంబై, హైదరాబాద్ లోని ఆఫ్ఘన్‌ రాయబార కార్యాలయాలు సేవలు అందిస్తూనే ఉన్నాయి.

అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధిస్తోందని జకియా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆఫ్ఘన్‌ తరఫున పనిచేస్తున్న ఏకైక మహిళా అధికారినైన తనను ఏడాదిగా అన్యాయంగా, ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారు. తనతోపాటు కుటుంబ సభ్యులు, బంధువుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని.. పరువుతీస్తున్నారని చెప్పారు. అందుకే ఈ విషప్రచారాన్ని తట్టుకోలేక పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Also Read : జమ్మూలో ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు..

Advertisment
తాజా కథనాలు