Telangana: బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ రద్దుకు వేసినట్లే: రేవంత్

20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని మోదీ పదేళ్లలో కేవలం 7లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని సీఎం రేవంత్ విమర్శించారు . బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనన్నారు.

New Update
Telangana: బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ రద్దుకు వేసినట్లే: రేవంత్

గాంధీభవన్‌లో బీజేపీపై ఛార్జ్‌షీట్‌ విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ' పదేళ్ల బీజేపీ వైఫల్యాలు, కుట్రలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ పదేళ్లలో కేవలం 7లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. రైతుల పోరాటంతో నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్న మోదీ... పార్లమెంట్ సాక్షిగా రైతులకు క్షమాపణ చెప్పాలి. బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోంది. చేనేత నుంచి కుటీర పరిశ్రమల వరకు జీఎస్టీ పేరుతో దోపిడీకి పాల్పడుతోంది. అగ్గి పెట్టె, సబ్బు బిల్ల, అగర్ బత్తీలపై కూడా మోదీ జీఎస్టీ విధించారు.

Also read: వారంలో 2 సార్లు డయాలసిస్‌ .. అయినా తగ్గని ఆత్మవిశ్వాసం.. ఇంటర్ లో 927 మార్కులు!

దేశ ప్రజలపై రూ.168 లక్షల కోట్ల అప్పుల భారం మోపారు. పదేళ్లలో రూ.113 లక్షల కోట్లు అప్పులు తెచ్చి భారత దేశాన్ని తాకట్టు పెట్టారు. 60 ఏళ్లు కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులను మోదీ పదేళ్లలో కార్పొరేట్‌లకు కట్టబెట్టారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై బీజేపీ కుట్ర చేస్తోంది. రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ ఎజెండా. ఆర్ఎస్సెస్ విధానాన్ని బీజేపీ అమలు చేస్తోంది. రిజర్వేషన్ల రద్దు కోసమే 400 సీట్ల మెజారిటీ సాధించాలని ప్రయత్నిస్తున్నారు. 2025లోగా రిజర్వేషన్లను రద్దు చేయాలనే విధానంతో ఆర్‌ఎస్సెస్ ఉంది. మొండిగా వ్యవహరించి అయినా సరే.. రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ కుట్ర చేస్తున్నారు. ఇందు కోసమే 2/3 వ వంతు మెజారిటీ సాధించాలని పన్నాగాలు పన్నుతున్నారు.

జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ స్పష్టంగా ప్రకటించారు. అందుకే దీన్ని అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. కాంగ్రెస్‌పై విష ప్రచారం చేసి ఎలాగైనా గెలిచి రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారు. బీజేపీకి వేసే ప్రతీ ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే. వర్గీకరణ కోసం కొట్లాడిన వారు కూడా ఇప్పుడు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో తెలియడం లేదు. రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్లు రద్దు కావాలనుకుంటే మీరు బీజేపీకి మద్దతు ప్రకటించండి. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వైపు నిలబడొద్దు. ఈ ఎన్నికలు రిజర్వేషన్లు వర్సెస్ రిజర్వేషన్లు రద్దు అన్న అంశం ఆధారంగా జరుగుతున్నాయని' రేవంత్ అన్నారు.

Also read: తమన్నకు సమన్లు జారీ చేసిన మహారాష్ట్ర సైబర్ సెల్‌.. ఎందుకంటే

Advertisment
తాజా కథనాలు