/rtv/media/media_files/2025/09/09/vice-president-election-2025-09-09-08-23-24.jpg)
Vice President Election
Vice Presidential Election : ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఈ రోజు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మంగళవారం జరిగే ఎన్నికల్లో పార్లమెంటు ఉభయసభల సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనునున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా బి.సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య ముఖాముఖీ పోరు జరగనుంది. ఉభయసభల ఎంపీలు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాజ్యాంగంలోని 64, 68 అధికరణలోని నిబంధనల ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతోంది. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరగుతుంది.
కాగా తమ తమ ఎంపీలు ఓట్లు సక్రమంగా వేసేందుకు వీలు కల్పిస్తూ రెండు కూటములూ వారికి ప్రత్యేక అవగాహన కల్పించాయి. బీజేపీ ఎంపీలకు ఆ పార్టీ అధినాయకత్వం రెండ్రోజుల వర్క్షాప్ నిర్వహించింది. ప్రధాని మోదీ దీనికి హాజరయ్యారు. ఇక విపక్ష ఎంపీలకు కాంగ్రెస్ సోమవారం మధ్యాహ్నం సంవిధాన్ సదన్ సెంట్రల్ హాలులో మాక్పోల్ నిర్వహించి.. ఓటు ఎలా వేయాలో వివరించింది. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వారికి విందు ఇచ్చారు. కాగా ఉపరాష్ర్టపతి ఎన్నిక కోసం అన్ని పార్టీల ఎంపీలూ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల మద్దతు కోరిన సుదర్శన్రెడ్డి కూడా దేశ రాజధానికి చేరుకున్నారు. తాను ఏ పార్టీ తరఫునా పోటీ చేయడం లేదని, రాజకీయాలకతీతంగా తనకు ఓటు వేయాలని ఆయన అన్ని పార్టీల ఎంపీలను కోరడంతో పాటు స్వయంగా లేఖలు కూడా రాశారు. ఈ ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. పార్లమెంటు భవనంలోని వసుధలోని ఎఫ్-101 గదిలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
ఇద్దరూ...ఇద్దరే...
కాగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఈసారి పోటీ చేస్తున్న ఇద్దరూ ప్రత్యేకమైనవారే కావడం విశేషం. దేశంలో రెండవ రాజ్యంగ అత్యన్నత పదవిగా భావించే ఈ పదవికి పోటీ చేస్తున్న ఇద్దరూ భిన్న వాదాలకు చెందినవారు. ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న సీపీ రాధాకృష్ణన్ బాల్యం నుంచీ హిందూత్వ భావజాలంతో ఎదిగిన జాతీయవాది. ఇక ఇండీ కూటమి తరఫున పోటీలో ఉన్న జస్టిస్ సుదర్శన్రెడ్డి సోషలిస్టు భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న ఉదారవాది. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ పోటీ సైద్దాంతిక సమరాన్ని తలపిస్తోంది. సీపీ రాధాకృష్ణన్ రెండు సార్లు లోక్సభకు ఎన్నికవ్వడమే కాకుండా మహారాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారు. అంతేకాక వివాదరహితుడుగా గుర్తింపు పొందారు. జస్టిస్ సుదర్శన్రెడ్డి దాదాపు రెండు దశాబ్దాల పాటు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయమూర్తిగా పలు చరిత్రాత్మక తీర్పులు వెలువరించిన అనుభవం ఉంది. వీరిలో ఎవరిని విజయం వరిస్తుందో సాయంత్రం తేలనుంది. నిజానికి సంఖ్యాబలం రీత్యా చూస్తే ఎన్డీఏ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో నెగ్గే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే క్రాస్ ఓటు మీద ఇండియా కూటమి ఆశలు పెట్టుకుంది.
ఓటర్లు 770 మందే
ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. లోక్సభలో ఒక సీటు ఖాళీగా ఉంది. దీంతో 542 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభలో ఆరు సీట్లు ఖాళీ ఉండటంతో 239 మంది రాజ్యసభ సభ్యులు ఓటు వేసే అవకాశం ఉంది. అంటే ఉభయ సభల్లో మొత్తం 781 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొనాలి. అయితే బీజేడీకి చెందిన ఏడుగురు, బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. అంటే మిగిలింది770 మంది మాత్రమే ఓటింగ్లో పాల్గొననున్నారు. వీరిలో 386 ఓట్లు ఎవరికి పడితే వారు ఉప రాష్ట్రపతిగా ఎంపికవుతారు.
ఏ పార్టీ ఎటు వైపు?
తెలంగాణకు చెందిన జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి ఇండియా కూటమినుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జేఎంఎం, సీపీఐఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, వీసీకే, శివసేన(ఉద్దవ్ థాకరే), భారత్ ఆదివాసీ పార్టీ, కేరళ కాంగ్రెస్,ఆర్ఎ్సపీ, ఎంఎన్ఎం(కమల్ హాసన్) ఎండీఎంకే, కేరళ కాంగ్రె్స(మణి) ఆర్ఎల్టీపీ, ఏజీఎం మద్దతు ఇస్తున్నాయి. దీని ప్రకారం ఇండియా కూటమి అభ్యర్థికి కనీసం 324 ఓట్లు లభించే అవకాశాలున్నాయి. ఇక ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్కు . బీజేపీ, టీడీపీ, జేడీయూ, శివసేన(షిండే) లోక్ జనశక్తి(చిరాగ్ పశ్వాన్), జనసేన, రాష్ట్రీయ లోక్దళ్, అప్నాదళ్(సోనేలాల్), అన్నాడీఎంకే, జేడీఎస్, ఆల్ జార్ఖండ్ స్టుడెంట్స్ యూనియన్, హిందూస్తానీ ఆవామ్ మోర్చా, ఏజీపీ, యుపిపిఎల్, ఎన్పీపీ, ఆర్ఎల్ ఎం, టీఎంసీ, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం, సిక్కిం క్రాంతికారీ మోర్చా, ఆర్పీఐ, వైసీపీ, పలువురు స్వతంత్ర సభ్యులు, నామినేటెడ్ సభ్యులు మద్దతునిస్తున్నారు. పార్టీల ప్రకారం 422 మంది సంఖ్యాబలం (లోక్ సభలో 293, రాజ్యసభలో 129) ఉంది.
తొలి ఓటు వేసేది ఎవరంటే..
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే, విపక్ష కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియా' కూటమి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉప రాష్ట్రపతి ఎన్నిక మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈ ఎన్నికలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలి ఓటు వేయనున్నారు. పంజాబ్, హర్యానా ఎంపీలతో కలిసి ప్రధాని తన ఓటు హక్కును వినియోగించుకుంటారు, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, రామ్మోహన్ నాయుడు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండేలను ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ ఎలక్షన్ ఏజెంట్లుగా నియమించారు.