/rtv/media/media_files/2025/09/21/rjd-2025-09-21-16-37-32.jpg)
బీహార్లో రాజకీయాలు మరోసారి తీవ్ర వాగ్వాదానికి దారితీశాయి. రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దివంగత తల్లిని దూషించారని భారతీయ జనతా పార్టీ (BJP) ఆరోపించింది. ఈ ఆరోపణలను ఆర్జేడీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తేజస్వీ యాదవ్ బీహార్ అధికార్ యాత్రను చేపట్టారు. ఇందులో భాగంగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మోదీ తల్లిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఆరోపిస్తుంది. ‘తేజస్వీ తన ర్యాలీలో మోదీ దివంగత తల్లిని అవమానించాడు. ఆర్జేడీ కార్యకర్తలు దుర్భాషలాడారు. వారిని తేజస్వీ కంట్రోల్ చేయాల్సి్ంది పోయి వారిని ప్రోత్సహించాడు. తల్లులను, సోదరీమణులను అవమానించడమే లక్ష్యంగా కాంగ్రెస్- ఆర్జేడీల ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. బీహార్ ప్రజలు దీన్ని మరచిపోరు. వీటన్నింటికీ గట్టిగా బదులిస్తారంటూ తేజస్వీ మాట్లాడిన వీడియోను కూడా ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
పూర్తిగా ఖండించిన ఆర్జేడీ
అయితే బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆర్జేడీ పూర్తిగా ఖండించింది. బీజేపీ షేర్ చేసిన వీడియో మార్ఫింగ్ చేయబడినదని, తమ నాయకుడిని బద్నాం చేయడానికి బీజేపీ పన్నిన కుట్ర అని ఆర్జేడీ పేర్కొంది. ఒకవేళ తమ పార్టీకి చెందిన ఎవరైనా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, తాము దానిని తీవ్రంగా ఖండిస్తామని ఆర్జేడీ నేతలు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు జరిపించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తేజస్వి యాదవ్ 'బీహార్ అధికార్ యాత్ర'కు ప్రజల నుండి వస్తున్న అపూర్వ మద్దతును చూసి బీజేపీ భయపడిందని, ప్రజల దృష్టిని మళ్ళించడానికి ఇలాంటి కుట్రలు చేస్తోందని ఆర్జేడీ ఆరోపించింది.
గతంలో కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్ లో ఓటర్ అధికార్ యాత్ర పేరుతో చేపట్టిన యాత్రలో కొందరు కాంగ్రెస్ వ్యక్తులు మోదీ తల్లిని దూషిస్తూ వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఆరోపించింది. దీనిపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. చనిపోయిన తన తల్లిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఆమెకు అవమానం జరిగిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.