/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t075130837-2025-11-20-07-53-15.jpg)
Nitish to take oath as CM for 10th time today.
Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రికార్డు స్థాయిలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇది పదోసారి కావడం విశేషం.బుధవారం జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతగా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనను ఎన్నుకాగానే సీనియర్ నేతలు వెంటరాగా నీతీశ్.. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను కలిశారు. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్కు అందజేశారు. నీతీశ్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించారు.
ఈ మేరకు గురువారం ఉదయం 11 గంటలకు పట్నాలోని గాంధీ మైదానంలో నీతీశ్తోపాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్సింగ్ తదితరులతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇక బీహార్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా మాజీ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి, శాసనసభాపక్ష ఉప నేతగా విజయ్ కుమార్ సిన్హా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల పరిశీలకుడు కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు.
కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గవర్నర్ అనుమతితో నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి ఏకంగా 202 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని మెజారిటీని సాధించింది. ఈ భారీ విజయంతో బిహార్లో మరోసారి నీతీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టనుంది. ఎన్డీఏ కూటమిలోని పక్షాలు సాధించిన స్థానాల వివరాల్లోకి వెళితే, బీజేపీ 89 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీని తర్వాత జేడీ(యూ) 85 స్థానాలు, చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ(రామ్ విలాస్) 19 స్థానాలు, జీతన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామ్ మోర్చా (హమ్) 5 స్థానాలు, ఉపేంద్ర కుశ్వాహ నేతృత్వంలోని ఆర్ఎల్ఎం 4 స్థానాలు గెలుచుకున్నాయి. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షమైన మహాగఠ్బంధన్ (మహాకూటమి) కేవలం 35 స్థానాలకే పరిమితమై, ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే.
Also Read: RTC డ్రైవర్ని చితకబాదిన వ్యక్తి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్
Follow Us